
సాక్షి, చెన్నై: తమిళనాడులో అధికార అన్నాడీఎంకేలో బహిష్కరణ పర్వల కొనసాగుతోంది. తాజాగా మాజీ మంత్రి పచ్చైమాల్ సహా కన్యాకుమారి జిల్లాకు చెందిన అన్నాడీఎంకే నిర్వాహకులపై 93 మందిపై వేటు పడింది. దీనిగురించి ఈపీఎస్, ఓపీఎస్ గురువారం సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశారు. అన్నాడీఎంకే పార్టీ విధానాలకు, లక్ష్యాలకు భిన్నంగా వ్యవహరిస్తున్న కారణంగా మాజీ మంత్రి పచ్చైమాల్ సహా 93 మందిని పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు.
చెన్నై ఆర్కేనగర్ ఉప ఎన్నిక వైఫల్యం తర్వాత అనేక జిల్లాలకు చెందిన పార్టీ నిర్వాహకులను ఎడపాడి పళనిస్వామి, ఓ.పన్నీర్సెల్వం మూకుమ్మడిగా పార్టీ నుంచి తొలగిస్తున్నారు. దినకరన్ వర్గానికి అనుకూలంగా పనిచేశారన్న ఆరోపణలతో ఇప్పటికే పలు జిల్లాలకు చెందిన నాయకులను పార్టీ నుంచి బహిష్కరించారు.