డీసీఐని మూసివేసే ప్రసక్తే లేదు: గడ్కరీ | Union Minister Nitin Gadkari Talk About DCI | Sakshi
Sakshi News home page

డీసీఐని మూసివేసే ప్రసక్తే లేదు: గడ్కరీ

Jul 13 2018 5:39 PM | Updated on Jul 13 2018 7:09 PM

Union Minister Nitin Gadkari Talk About DCI - Sakshi

సాక్షి, విశాఖపట్నం: ప్రకాశం జిల్లా ఓడరేవుకు 3వేల ఎకరాలు కేటాయిస్తే పోర్టు నిర్మాణానికి మేము సిద్ధమని కేంద్ర షిప్పంగ్‌ మంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు. ఆమేరకు ముఖ్యమంత్రికి ప్రతిపాదనలు అందిస్తామని తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డ్రెజ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(డీసీఐ)విషయంలో ఓ నిర్ణయానికి వచ్చామన్నారు. దీనికి సంబంధించిన కేంద్ర కార్యాలయం విశాఖలోనే ఉంటుందని, దానిని మూసివేసే ప్రసక్తే లేదని తెలిపారు. డీసీఐని బలోపేతం చేయడమే మా లక్ష్యమని, దీనికి సంబంధించి కెబినెట్‌ నోట్‌ ఇవ్వడం జరిగిందని వెల్లడించారు. డీసీఐ సేవల్లో మరింత పోటీ పెంచి, మరికొన్ని ఉద్యోగాలు కల్పిస్తామని గడ్కరీ తెలిపారు. 

సాగరమాల ప్రాజెక్ట్‌లో భాగంగా విశాఖ పోర్టుకు అనుబంధంగా శాటిలైట్‌ పోర్టును ఏర్పాటు చేస్తామని గడ్కరీ చెప్పారు. ప్రధాన పోర్టుల నుంచి వ్యవసాయ, అక్వా ఉత్పత్తు ఎగుమతికి ప్రాధాన్యత కల్పించాలని నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. అన్నీ మేజర్‌ పోర్టులలో టూరిజం అభివృద్ధికి ఫ్లోటింగ్‌ హోటళ్లు, రెస్టారెంట్‌లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. వాటర్‌వేస్‌ టూరిజం అభివృద్ధి చేయబోతున్నామని, ముంబై నుంచి గోవాకు టూరిజం క్రూయిజ్‌టు నడుపుతున్నామన్నారు. 

పోర్టుల ఆధునీకరణ, యాంత్రీకరణంగా గైడ్‌ చేసేందుకు మద్రాస్ ఐఐటీ సహకారం తీసుకుంటున్నామని తెలిపారు. మురుగు నీరు సముద్రంలో చేరకుండా సీవెజ్‌ ప్లాంట్‌ల నిర్మాణం అన్నీ పోర్టులకు తప్పనిసరి చేశామని పేర్కొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement