
సాక్షి, కోల్కతా: తమకు చెందిన భూమిలో తలపెట్టిన రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకున్న అక్కాచెల్లెళ్లను నడిరోడ్డుపై కొట్టి, ఈడ్చుకెళ్లిన దారుణ ఘటన శుక్రవారం పశ్చిమ బెంగాల్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్మృతి ఇరానీ దాస్ స్థానిక పాఠశాలలో ఉపాధ్యాయురాలినిగా పని చేస్తోంది. తన తల్లి, సోదరితో కలిసి ఫటా నగర్లో నివాసముంటోంది. గతంలో పంచాయతీ రోడ్డు నిర్మాణం కోసం వీరికి చెందిన భూమిలో కొంత భాగాన్ని అప్పగించారు. అయితే గ్రామ పంచాయతీ మరోసారి రోడ్డు వెడల్పు చేయాలని భావించగా వారు దీనికి ఒప్పుకోలేదు. దీనివల్ల తమ భూమిలో ఎక్కువ మొత్తాన్ని కోల్పోతామని దీనికి వారు ససేమిరా అన్నారు. అయితే ఇదేదీ పట్టని పంచాయతీ పెద్దలు జేసీబీతో సహా ఇంటికి చేరుకొని రోడ్డు నిర్మాణం తలపెట్టారు. దీన్ని అడ్డుకుని నిరసన తెలిపిన ఇద్దరు యువతులపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ)కి చెందిన పంచాయతీ నాయకుడు అమల్ సర్కార్, తన అనుచరులతో దాడికి తెగబడ్డాడు.
నిందితుని సస్పెండ్
అతని అనుచరులు యువతుల కాళ్లను తాళ్లతో కట్టేసి, కొట్టుకుంటూ విచక్షణారహితంగా నడిరోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లారు. దాడిని అడ్డుకున్న సోదరిని సైతం కిందపడేసి ఇష్టమొచ్చినట్లుగా కొట్టారు. నిందితుడు ఆమె మెడలోని బంగారు గొలుసును, మొబైల్ ఫోన్ను లాక్కున్నాడు. ఇక ఈ ఘటనపై బాధితురాలు స్మృతి ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇప్పటివరకు దాడికి కారణమైన వారిలో ఒక్కరిని కూడా అరెస్ట్ చేయకపోవడం గమనార్హం. ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో టీఎంసీ అధిష్టానం నిందితుడు అమల్ సర్కార్ను పార్టీ నుంచి నిషేధిస్తున్నట్లు ప్రకటించింది.
చంపుతామని బెదిరించారు
ఈ ఘటనపై స్మృతి మాట్లాడుతూ.. ‘దాడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాను. కానీ ఎప్పుడైతే కింద పడ్డానో ఆ క్షణం వాళ్లు నా కాళ్లు లాగి, తాళ్లతో కట్టేసి 30 అడుగుల వరకు ఈడ్చుకుంటూ పోయారు. వాళ్లు నన్ను తీవ్రంగా కొట్టారు. ఐరన్ రాడుతో తలపై బాదేందుకు ప్రయత్నించారు. చంపుతామని బెదిరించారు’ అని పేర్కొంది. బీజేపీ నాయకుడు, బలుర్ఘాట్ ఎంపీ సుకాంత మజుందార్ యువతులపై దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ దాడిని అనాగరిక చర్యగా అభివర్ణించారు. అభివృద్ధి చెందిన నాగరిక సమాజంలో ఇప్పటికీ ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయంటే నమ్మశక్యంగా లేదన్నారు. దీనికి కారణమైన పంచాయతీ నాయకుడిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
చదవండి: