‘ప్రధాని’ రేసులో థాయ్ యువరాణి
బ్యాంకాక్: థాయ్లాండ్ ప్రధాన మంత్రి పదవికి జరిగే ఎన్నికల బరిలో ఉంటానని యువరాణి ఉబోల్ రతన ప్రకటించారు. థాయ్ రాజు మహా వజ్రాలంగ్కోర్న్ సోదరి అయిన రతన..మాజీ ప్రధాని థక్షిన్ షినవ్రతకు చెందిన థాయ్ రక్ష చార్త్ పార్టీ తరఫున పోటీ చేయనున్నట్లు తెలిపారు. ‘పార్టీ ఉన్నత స్థాయి సమావేశంలో ఉబోల్ రతన అభ్యర్థిత్వాన్ని ఖాయం చేశాం’ అని థాయ్ రక్ష చార్త్ పార్టీ నేత ప్రీచాపొల్ పొంగ్పనిచ్ తెలిపారు. 1972లో అమెరికా దేశస్తుడు పీటర్ జెన్సెన్ను వివాహం చేసుకున్న రతన, రాచరిక గౌరవాలను వదులుకున్నారు. ఏకైక కొడుకు మరణం, భర్తతో విడాకులు తర్వాత రాచ కుటుంబ సభ్యురాలిగానే కొనసాగుతున్నారు. గెలుపు తమదే అనే ధీమాతో ఉన్న సైనిక పాలకులకు రతన నిర్ణయం శరాఘాతంగా మారింది.