పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో కలసి బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లి తిరిగొచ్చిన ప్రముఖ సినీ నిర్మాత, వ్యాపారవేత్త శివాజీ పంజాను కోల్కతా విమానాశ్రయంలో ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కోల్కతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో కలసి బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లి తిరిగొచ్చిన ప్రముఖ సినీ నిర్మాత, వ్యాపారవేత్త శివాజీ పంజాను కోల్కతా విమానాశ్రయంలో ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్థిక మోసం కేసులో శివాజీకి సంబంధం ఉండడంతో శనివారం రాత్రి ఆయనను ఢిల్లీ పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు. పోలీసులు శివాజీని అరెస్టు చేయడానికి కొద్దిసేపటి ముందే ఆయన మమతతోపాటు బంగ్లా నుంచి తిరిగిరావడం విశేషం. ఆదివారం శివాజీకి కోల్కతా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇండస్ట్రియల్ ఫైనాన్షియల్ కార్పొరేషన్కు నకిలీ పత్రాలు సమర్పించి ఆయన రూ.18 కోట్ల రుణం తీసుకున్నారని ఆరోపణలున్నాయి. ఢిల్లీ పోలీస్ ఆర్థిక నేరాల విభాగం కేసు నమోదు చేసింది. ఈ అంశంపై ఓ విలేకరి మమతను ప్రశ్నించగా ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నేను నిన్ను కూడా జైల్లో వేయగలను. కానీ నేనా పని చేయలేద’ని అన్నారు. శివాజీ అరెస్టుపై తననెందుకు అడుగుతున్నారని ప్రశ్నించారు.