
మానసిక అనారోగ్యాలకూ బీమా భద్రత కల్పించాలని సుప్రీంలో పిటిషన్
సాక్షి, న్యూఢిల్లీ : మానసిక అస్వస్థతకూ బీమా భద్రతను కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సర్వోన్నత న్యాయస్ధానం మంగళవారం కేంద్ర ప్రభుత్వం, ఐఆర్డీఏకు నోటీసులు జారీ చేసింది. పిటిషన్ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు మానసిక సమస్యలకూ బీమా కవరేజ్ను ఎందుకు వర్తింపచేయరాదో బదులివ్వాలని కోరింది. తదుపరి విచారణను రెండు వారాల పాటు వాయిదా వేసింది. కోవిడ్-19 దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తుండటం బాలీవుడ్ యువ హీరో సుశాంత్ రాజ్పుట్ బలవన్మరణం నేపథ్యంలో కుంగుబాటు, యాంగ్జైటీలపై చర్చ సాగుతున్న క్రమంలో సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ దాఖలు కావడం గమనార్హం.
కాగా, బీమా పాలసీల్లో మానసిక అస్వస్థతకూ బీమా భద్రత కల్పించేలా కేటాయింపులు చేపట్టాలని 2018లో ఐఆర్డీఏ బీమా కంపెనీలను ఆదేశించింది. శారీరక అనారోగ్యానికి అవసరమయ్యే చికిత్సల తరహాలో మానసిక అనారోగ్యానికి బీమా కవరేజ్ కల్పించాలని బీమా కంపెనీలను ఆదేశిస్తూ ఐఆర్డీఏ 2018 మేలో ఉత్తర్వులు జారీ చేసింది.