జీఎస్‌టీ బిల్లుపై ఏకాభిప్రాయం | States, Centre reach consensus on GST Bill | Sakshi
Sakshi News home page

జీఎస్‌టీ బిల్లుపై ఏకాభిప్రాయం

Dec 16 2014 4:34 AM | Updated on Sep 2 2017 6:13 PM

ప్రతిపాదిత వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) బిల్లుపై నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడింది.

కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాల మధ్య ప్రతిష్టంభనకు తెర
జీఎస్‌టీ నుంచి పెట్రోలియం ఉత్పత్తులకు మినహాయింపు
ప్రస్తుత శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంట్ ముందుకు

 
 న్యూఢిల్లీ: ప్రతిపాదిత వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) బిల్లుపై నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడింది. మరికొన్ని రోజుల్లో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగియనున్న నేపథ్యంలో ఈ బిల్లుకు సంబంధించి కేంద్ర, రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. సోమవారం నాటి చర్చల్లో జీఎస్‌టీ నుంచి పెట్రోలియంను మినహాయించేందుకు కేంద్రం అంగీకరించింది. దీంతో ఈ అంశంలోనే బిల్లును వ్యతిరేకిస్తున్న రాష్ట్రాలు దిగివచ్చి.. జీఎస్‌టీకి మద్దతు తెలిపాయి. ప్రవేశ పన్నును జీఎస్‌టీలో కొనసాగించేందుకు అంగీకరించాయి. దీంతో ఈ శీతాకాల సమావేశాల్లోనే జీఎస్‌టీ బిల్లు పార్లమెంట్ ముందుకు రావడానికి మార్గం సుగమమైంది. అయితే ఈ బిల్లును మొదట కేంద్ర మంత్రివర్గం ఆమోదించాల్సి ఉంది.
 
 కొత్త పన్నుల విధానం 2016 ఏప్రిల్ నుంచి అమలులోకి రానుంది.సోమవారం పంజాబ్, హరియాణా, గుజరాత్, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, జమ్మూకశ్మీర్ రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ చర్చలు జరిపారు. జీఎస్‌టీ బిల్లుపై ఏకాభిప్రాయం కుదిరింది.  పెట్రోలియం ఉత్పత్తులను కొన్నేళ్ల పాటు జీఎస్‌టీ బిల్లు నుంచి మినహాయించడానికి ఏకాభిప్రాయం కుదిరిందని, కొత్త పన్నుల విధానంలో దీన్ని చేర్చే అంశంపై ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. జీఎస్‌టీ అమలులోకి రావడం వల్ల రాష్ట్రాలకు కలిగే రెవెన్యూ నష్టాలను మూడేళ్ల పాటు భర్తీ చేసేందుకు, ఆ తర్వాత రెండేళ్ల కాలానికి కొంత మొత్తాన్ని పరిహారంగా చెల్లించేందు కేంద్రం అంగీకరించినట్టు తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement