
స్వరూపానంద సరస్వతి
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుల ప్రమాణాస్వీకార ముహూర్తాలపై శారదా పీఠాధిపతి స్వరూపానంద సంచలన వ్యాఖ్యలు చేశారు.
విశాఖపట్నం: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుల ప్రమాణస్వీకార ముహూర్తాలపై శారదా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. వారు ఇద్దరూ దుర్ముహూర్తంలో ప్రమాణస్వీకారం చేసినట్లు ఆయన చెప్పారు. ఈ రోజు స్వరూపానంద పుట్టిన రోజు. హుదూద్ తుపాను కారణంగా పుట్టినరోజు వేడుకలకు ఆయన దూరంగా ఉన్నారు.
వారు ఇద్దరూ సూర్యాస్తమయం అయిన తరువాతే ప్రమాణస్వీకారం చేశారన్నారు. అవి సరైన ముహూర్తాలు కానందునే కాశ్మీర్ వరదలు, హుదూద్ తుపాను వచ్చినట్లు తెలిపారు. మరో మూడేళ్ల వరకు ప్రకృతి వైపరీత్యాలు తప్పవని ఆయన హెచ్చరించారు. రేపు గుజరాత్లో రానున్న వరదలకు కూడా ఇదే కారణం అన్నారు.
రాజకీయ నాయకులపై తనకు ఎటువంటి ద్వేషాలు లేవన్నారు. ఇప్పటికైనా దేశంలో ఉన్న పీఠాధిపతులను పిలిపించి సలహాలు తీసుకుంటే మంచిదన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. స్వరూపానంద భక్తులు ఆయన మాటలను విశ్వసిస్తున్నారు.
**