మోదీతో సెల్ఫీకి రూ.కోటి! | ‘Selfie with Modi’ bombed in Delhi polls, cost BJP Rs 1cr | Sakshi
Sakshi News home page

మోదీతో సెల్ఫీకి రూ.కోటి!

Oct 31 2015 5:10 PM | Updated on Jul 18 2019 2:11 PM

మోదీతో సెల్ఫీకి రూ.కోటి! - Sakshi

మోదీతో సెల్ఫీకి రూ.కోటి!

బిహార్ ఎన్నికలు ప్రారంభం అయినప్పటి నుంచి మోదీ సెల్ఫీలకు దూరంగా ఉంటున్నారు. ఎందుకు?

న్యూఢిల్లీ: సందర్భం విదేశీయానమైనా, స్వదేశీయులతో ములాఖత్ అయినా.. సెల్ఫీ దిగనిదే ప్రోగ్రామ్ పూర్తయినట్లు కాదు ప్రధాని నరేంద్ర మోదీకి! సమకాలీన రాజకీయాల్లో సోషల్ మీడియాను  అంతగా వినియోగిస్తున్న నాయకుడు మరొకరు లేరంటే అతిశయం కాదు. కానీ.. బిహార్ ఎన్నికలు ప్రారంభం అయినప్పటి నుంచి ఆయన సెల్ఫీలకు దూరంగా ఉంటున్నారు. మోదీలో చోటుచేసుకున్న ఈ అనూహ్య పరిణామానికి కారణం ఏమిటి? అని ఆరా తీయగా ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీ ఎన్నికల సందర్భంగా 'మోదీతో సెల్ఫీ' (సెల్ఫీ విత్ మోదీ) అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు బీజేపీ నాయకులు. ఢిల్లీలోని అన్ని నియోజకవర్గాల్లో మొత్తం ఏడు విడతలుగా సాగిన ఈ కార్యక్రమంలో.. తాత్కాలిక బూత్ లను, వాటిలో మోదీ వర్చువల్ ఇమేజ్(కాల్పనిక చిత్రం)ను ఏర్పాటు చేశారు. ఆ ఇమేజ్తో సెల్ఫీ తీసుకుంటే.. స్వయంగా మోదీనే మన పక్కనున్నట్లు కనిపిస్తుంది. లక్షలాది ఢిల్లీ ప్రజలు మోదీతో సెల్ఫీలు దిగి ఆ గుర్తును భద్రంగా సేవ్ చేసుకున్నారు. కాగా, ఒక్కో విడత.. మోదీ విత్ సెల్ఫీకి రూ. 86.50 లక్షలు వెచ్చించామని, అలా ఈ కార్యక్రమానికి మొత్తం రూ. 1.06 కోట్ల ఖర్చయ్యాయని తేలింది. ఈ మేరకు ఎన్నికల కమిషన్కు సమర్పించిన ఖర్చుల జాబితాలో బీజేపీ పేర్కొంది.

అంత ఖర్చయినా ఫర్వాలేదుగానీ ఓట్లు మాత్రం కమలానికి కాకుండా చీపురుకు పడటమే జీర్ణించుకోలేకపోయారు ఆ పార్టీ నేతలు. విఫల ప్రయోగం మళ్లీ ఎందుకని బిహార్ ఎన్నికల ప్రచారంలో సెల్ఫీ ఐడియాను అటకెక్కించారు. అయితే మోదీ తీసుకున్నది విరామం మాత్రమేనని.. నవంబర్ 12 నుంచి ప్రారంభం కానున్న ఇంగ్లాండ్ పర్యటనలో మళ్లీ సెల్ఫీలు చిందిస్తారని ఆశిస్తున్నారు ఆయన అభిమానులు. అన్నట్లు గత ఎన్నికల్లో 'త్రీడీ ప్రచారం' గుర్తుందిగా. ప్రసంగాలను ముందే త్రీడీలో చిత్రీకరించి, ప్రత్యేక స్క్రీన్ లు ఉన్న వాహనాల ద్వారా ఊరూరా ప్రచారం చేసినందుకుగానూ రూ.60 కోట్లు ఖర్చయినట్లు బీజేపీ తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement