మహారాష్ట్రను ముంచెత్తిన వరద : 16 మంది మృతి
ముంబై : మహారాష్ట్రలో వరద తీవ్రతతో 16 మంది మరణించగా పెద్దసంఖ్యలో ప్రజలు నిర్వాసితులయ్యారు. భారీ వర్షాలతో షోలాపూర్, సంగ్లి, సతారా, కొల్హాపూర్, పూణే జిల్లాల్లో లోతట్టు ప్రాంతాల నుంచి 1,40,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేయడంతో ఆయా జిల్లాల్లో స్కూళ్లు, విద్యాసంస్థలు పనిచేయడం లేదు. మరో మూడు రోజులు భారీ వర్షాలు తప్పవని వాతావరణ శాఖ హెచ్చరించింది.
పూణే జిల్లాలో ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని అధికారులు వెల్లడించారు. వరద బాధిత ప్రాంతాల్లో ఆహారం, వైద్య సేవలతో పాటు నిత్యావసర వస్తువుల సరఫరా వంటి సహాయ చర్యలు ముమ్మరంగా చేపడుతున్నామని చెప్పారు. ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ, కోస్ట్ గార్డ్ దళాలు సహాయ చర్యల్లో పాలుపంచుకుంటున్నాయని తెలిపారు. ఇక భారీ వర్షాలతో పూణే, సతారా, సంగ్లీ, కొల్హాపూర్ జిల్లాల్లోని జలాశయాలు నిండుకుండలను తలపిస్తున్నాయి.