
'ప్రజలు మావెంటే.. పవర్ మాదే..'
ఉత్తరప్రదేశ్లో అధికారాన్ని కైవసం చేసుకుంటామని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
లక్నో: ఉత్తరప్రదేశ్లో అధికారాన్ని కైవసం చేసుకుంటామని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. లక్నోలో ఓ కార్యక్రమంలో హాజరయ్యేందుకు వెళుతున్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్లో పరివర్తన్ ర్యాలీతో బీజేపీ మార్పునకు పునాది వేసిందని చెప్పారు. ప్రజలు కూడా తాము ఆ రాష్ట్రంలో వేగవంతమైన మార్పును తీసుకొస్తామని నమ్ముతున్నారని అన్నారు.
పెద్ద నోట్ల రద్దుకు, ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదని, ఆ అంశంతో ముడిపెట్టి చూడాల్సిన పనిలేదని స్పష్టం చేశారు. పెద్ద నోట్ల రద్దు ఎన్నికల్లో సాధించే గెలుపో, ఓటమో కాదని, జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని తీసుకున్న నిర్ణయం అని తెలిపారు. అవినీతిని తగ్గించడం, నల్లడబ్బును నిర్మూలించి దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడమే పెద్ద నోట్ల రద్దు నిర్ణయ ఉద్దేశమని చెప్పారు.