మోదీ చేతిలో ఉన్నది యాభైవేలే!
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ స్థిరచరాస్థుల వివరాలు వెల్లడయ్యాయి. ఈ సంవత్సరం మార్చి 31నాటికి ఆయన వద్ద ఉన్న నగదు కేవలం రూ.48,944 అని తేలింది. ఈ వివరాలను ప్రధాని కార్యాలయం(పీఎంవో) తాజాగా తన వెబ్సైట్లో పొందుపరిచింది. గత ఏడాది మోదీ వద్ద రూ.1,50,000 నగదు ఉండగా ఈ ఏడాది 67శాతం తగ్గింది. ప్రస్తుతం మోదీ మొత్తం స్థిరచరాస్థుల విలువ రూ.2.28 కోట్లు. ఇందులో చరాస్తుల విలువ రూ.1,28,50,498.
స్థిరాస్తి అయిన గుజరాత్లోని గాంధీనగర్లో ఉన్న మోదీ సొంతింటి మార్కెట్ విలువ దాదాపు రూ.కోటి. అయితే, 16ఏళ్ల క్రితం ఆ ఇంటిని మోదీ కేవలం రూ.లక్షకు కొనుగోలు చేశారు. గాంధీనగర్లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలో మోదీకి రూ.11,29,690 డిపాజిట్లు ఉన్నాయి. అదే బ్రాంచీలో మోదీ రూ.1,07,96,288 ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. మోదీకి తన పేరు మీద కారుగానీ, మరే వాహనమూ లేదు. మోదీ వద్ద బంగారు నగలు లేవు. ప్రధానికాక ముందునాటి 45 గ్రాముల బరువైన రూ.1,38,060 విలువైన నాలుగు బంగారు ఉంగరాలు మాత్రం ఉన్నాయి. మోదీ ఏ బ్యాంకులో ఎలాంటి రుణాలు తీసుకోలేదు.
మరిన్ని వార్తలు