
అభిమానులకు రజనీ అభివాదం, వెనుకవైపు పేరవై గుర్తుగా భావిస్తున్న చిత్రం
సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్ ‘రజనీ పేరవై’ (రజనీ సమాఖ్య) పేరుతో ప్రజల్లోకి వస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అందరూ అనుకుంటున్నట్లుగా ఆయన ఈ నెల 31న పార్టీ ప్రకటించబోరని తెలుస్తోంది. అయితే ‘రజనీ పేరవై’ పేరిట ఒక వేదికను ప్రకటిస్తారని సమాచారం. 20– 30 ఏళ్ల మధ్యనున్న యువకులను పేరవైలో సభ్యులుగా చేర్చుకోవాలని అభిమాన సంఘాలకు ఇప్పటికే రజనీ నుంచి ఆదేశాలు వెళ్లాయి. నియోజవర్గాల వారీగా జనాభా, ఓటర్ల సంఖ్య, స్థానిక సమస్యల గురించి సమాచారం సేకరించే బాధ్యతలను పేరవై ప్రతినిధులకు అప్పగించే అవకాశాలున్నాయి. అలాగే తాను పార్టీ స్థాపిస్తే సినీ పరిశ్రమ నుంచి ఎవరెవరు వస్తారని రహస్య సర్వే చేయిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, అభిమానులతో రజనీ భేటీ చెన్నైలో గురువారమూ కొనసాగింది.