
వివాదమేం లేదు..
ఎంసెట్ నిర్వహణలో తమకు సంబంధించి ఎటువంటి వివాదం లేదని.. తాము చట్ట ప్రకారం ముందుకు వెళతామని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్రెడ్డి పేర్కొన్నారు.
ఎంసెట్పై ఏపీ ప్రభుత్వమే రాద్ధాంతం చేస్తోంది: జగదీశ్రెడ్డి
ఢిల్లీలో విద్యాశాఖ మంత్రుల సదస్సులో ప్రసంగించిన మంత్రి
సాక్షి, న్యూఢిల్లీ: ఎంసెట్ నిర్వహణలో తమకు సంబంధించి ఎటువంటి వివాదం లేదని.. తాము చట్ట ప్రకారం ముందుకు వెళతామని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కావాలని ఎంసెట్ విషయంలో రాజకీయం చేస్తోందని ఆరోపించారు. మంగళవారం ఢిల్లీలోని విజ్ఞాన్భవన్లో యూజీసీ ఆధ్వర్యంలో ‘చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టం ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్’ అంశంపై నిర్వహించిన రాష్ట్రాల విద్యాశాఖ మంత్రుల సమావేశంలో జగదీశ్రెడ్డి పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అంశాలన్నింటినీ అమలు చేసేందుకు తెలంగాణ కట్టుబడి ఉందని... ఏపీ ప్రభుత్వమే చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని మంత్రి జగదీశ్రెడ్డి ఆరోపించారు.
లేని అధికారాలను ఉన్నట్లుగా చూపించుకుని ఏపీ ఉన్నత విద్యామండలి తనకుతాను షెడ్యుల్ విడుదల చేసిందని... పైగా తప్పు చేసినవారే గవర్నర్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశారని విమర్శించారు. ఇరు రాష్ట్రాల విద్యార్థులకు ఇబ్బంది కలుగకుండా ఒకే ఎంట్రెన్స్ నిర్వహించేందుకు తెలంగాణ సుముఖంగా ఉందన్నారు. ఈ విషయాన్ని ఏపీ విద్యా మంత్రికీ చెప్పామని, నిర్ణయం తీసుకోవాల్సింది వారేనని మంత్రి అన్నారు. ఏపీ ప్రభుత్వం కోర్టులకు వెళ్లినా అక్కడా చట్టప్రకారమే వెళ్లాలని తీర్పు వస్తుందన్నారు. ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రతి అంశాన్ని రాజకీయం చేయడం అలవాటని మంత్రి విమర్శించారు.
కొత్త విధానంతో మంచి ఫలితాలు
‘చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టం’తో మంచి ఫలితాలు వస్తాయని విద్యా మంత్రుల సదస్సులో మంత్రి జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. నిరంతరం విద్యావ్యవస్థను మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సంస్కరణలు చేపట్టాలని కేంద్రం, యూజీసీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. కాగా.. తెలంగాణకు సర్వశిక్షా అభియాన్ నిధులను త్వరగా విడుదల చేయాలని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి మంత్రి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విద్యాశాఖలో పలు పథకాలకు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి వినతిపత్రాన్ని సమర్పించారు.