ఎన్‌ఐఏ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

NIA Bill Passes In Lok Sabha - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) సవరణ బిల్లును సోమవారం లోక్‌సభ ఆమోదించింది. ఎన్‌ఐఏకు మరిన్ని అధికారాలు కల్పించే విధంగా సవరణ బిల్లును రూపొందించారు. తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసుల విచారణ నిమిత్తం ప్రత్యేక కోర్టులను కూడా ఏర్పాటు చేసుకునే వెసులుబాటును కూడా బిల్లులో పొందుపరిచారు. ప్రతిపక్షాల ఆరోపణలు, విమర్శల నడుమ ఈ బిల్లు ఆమోదం పొందింది. సవరణ బిల్లు ద్వారా కేంద్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడే అవకాశం ఉందని ప్రతిపక్షాలు వ్యతిరేకించిన్పటికీ.. బిల్లు సునాయాసంగా పాసయ్యింది. తదుపరిగా రాజ్యసభలో బిల్లుకు ఆమోదం లభిస్తే చట్టంగా మారనుంది.

కాగా చర్చలో భాగంగా సభలో విపక్షాల ఆరోపణలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో లా అండ్‌ ఆర్డర్‌ను పరిరక్షించడానికే ఎన్‌ఐఏను సవరించామని వివరించారు. ఈ సందర్భంగా అమిత్‌ షా మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పోటా చట్టం రద్ద చేసిన అనంతరం దేశంలో ఉద్రదాడులు మరింత పెరిగాయని విమర్శించారు. కేవలం ఓట్ల కోసం పోటా చట్టాన్ని రద్దు చేశారని, ఆ తరువాత ముంబై దాడులు జరిగాయని గుర్తుచేశారు. దాని స్థానంలోనే 2009లో ఎన్‌ఐఏ చట్టం చేశారని తెలిపారు. కీలకమైన బిల్లుకు పార్టీలన్నీ మద్దతు ఇవ్వాలని షా విజ్ఞప్తి చేశారు. మోదీ నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం ఎప్పటికీ చట్టాలను దుర్వినియోగం చేయదని స్పష్టం చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top