నీట్‌ ఫలితాలు విడుదల

NEET result 2019 declared, Nalin Khandelwal secures AIR1 - Sakshi

ఎంబీబీఎస్‌ ప్రవేశాలకు రంగం సిద్ధం

నీట్‌ ర్యాంకుల ఆధారంగానే ప్రభుత్వ, ప్రైవేటు సీట్ల భర్తీ

 సాక్షి, హైదరాబాద్‌: జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌) ఫలితాలు బుధవారం విడుదల అయ్యాయి. ఫలితాలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుదల చేసి వెబ్‌సైట్‌లో పెట్టింది. రాజస్తాన్‌కు చెందిన నలిన్‌ ఖండేల్‌వాల్‌ 701 మార్కులు సాధించి ఆల్‌ ఇండియా మొదటి ర్యాంక్‌ సాధించగా, తెలంగాణకు చెందిన మాధురి రెడ్డి 695 మార్కులతో 7వ ర్యాంక్‌ సాధించింది. అలాగే ఫలితాల్లోనూ రాజస్తాన్‌ మొదటి స్థానంలో నిలిచింది. ఆ రాష్ట్రం నుంచి మొత్తం 7,91,042మంది విద్యార్థులు నీట్‌లో అర్హత సాధించారు. ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 14,10,754 మంది హాజరు అయ్యారు.  

కాగా ఎంబీబీఎస్, బీడీఎస్‌ కోర్సుల్లో 2019–20 వైద్య విద్య సంవత్సరంలో ప్రవేశాలకు గత నెల 5న నీట్‌ నిర్వహించిన సంగతి తెలిసిందే. జనరల్‌ కేటగిరీ విద్యార్థులకు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు కనీసం 40 శాతం పర్సంటైల్, దివ్యాంగులకు 45 శాతం పర్సంటైల్‌ను అర్హత మార్కులుగా నిర్ణయించారు. నీట్‌ అర్హత అనంతరం కౌన్సెలింగ్‌ తేదీలను త్వరలో ప్రకటించనున్నారు. గతేడాది మొదటి విడత కౌన్సెలింగ్‌ ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్‌ మూడో తేదీ వరకు నిర్వహించారు. నీట్‌లో అర్హత సాధించిన వారిలో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం, ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్‌ కల్పించారు.

అర్హత మార్కులు పెరిగే అవకాశం..
ఈసారి నీట్‌ ప్రవేశ పరీక్ష సులువుగా ఉండటంతో అర్హత మార్కులు కూడా పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం గతేడాదితో పోలిస్తే 20 నుంచి 25 వరకు అర్హత మార్కులు పెరిగే అవకాశం ఉందంటున్నారు. 720 నీట్‌ మార్కులకు గాను, గతేడాది జనరల్‌ కేటగిరీలో అర్హత మార్కు 105గా ఉంది. ఈసారి 125 నుంచి 130 మార్కుల వరకు పెరిగే అవకాశముందని అంటున్నారు. అలాగే ఆలిండియా టాప్‌ వెయ్యి ర్యాంకులు సాధించిన విద్యార్థుల మార్కులు 650పైనే ఉండేది. అది కూడా ఈసారి పెరిగే అవకాశం ఉందని నిపుణులు ఇప్పటికే అంచనా వేశారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top