ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులకు నోటిఫికేషన్ విడుదల చేసిన కాళోజీ వర్సిటీ
12వ తేదీ సాయంత్రం వరకు గడువు
రాష్ట్రం నుంచి అర్హత సాధించిన 38వేల మంది దరఖాస్తుకు అర్హులు
సింగరేణి కుటుంబాలకు రామగుండం కాలేజీలో 5% కోటా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో 2026–27 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్, డెంటల్ కళాశాలల్లో కాంపిటెంట్ అథారిటీ కోటా కింద ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. నీట్–యూజీ–2026లో అర్హత సాధించిన 38,021 మంది అభ్యర్థులు రాష్ట్ర మెరిట్ జాబితాలో స్థానం కోసం ఆన్లైన్లో నమోదు చేసుకోవలసి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ రాష్ట్ర ప్రభుత్వ వైద్య, దంత కళాశాలల్లో ఆల్ ఇండియా కోటాకు కేటాయించిన 15 శాతం సీట్లను మినహాయించి... మిగతా సీట్లు, ప్రైవేట్ వైద్య కళాశాలల ‘ఏ’ కేటగిరీ సీట్లు, ప్రైవేట్ డెంటల్ కళాశాలల కాంపిటెంట్ అథారిటీ కోటా సీట్లకు వర్తిస్తుంది.
సీట్ల మ్యాట్రిక్స్ను వెబ్ ఆప్షన్లకు ముందు ప్రత్యేకంగా ప్రకటించనున్నట్లు వర్సిటీ తెలిపింది. ఆన్లైన్ నమోదు, ధ్రువపత్రాల అప్లోడ్ ప్రక్రియ ఆగస్టు 5 ఉదయం 6 గంటల నుంచి 12వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. తర్వాత తాత్కాలిక మెరిట్ జాబితాను విడుదల చేస్తారు. తుది ఒరిజినల్ ధ్రువపత్రాల పరిశీలన కేటాయించిన కళాశాలలో అడ్మిషన్ సమయంలో జరుగుతుంది. దరఖాస్తు, ప్రాసెసింగ్ రుసుము కింద ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.3,200, మిగతా వారు రూ.4వేలు చెల్లించాలి.
అప్లోడ్ చేయాల్సినవి
నీట్ స్కోర్ కార్డు, టెన్త్ మెమో, ఇంటర్ మెమో, 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికెట్లు, టీసీ, కుల ధ్రువపత్రం (వర్తిస్తే), మైనారిటీ, ఈడబ్ల్యూఎస్, ఆదాయ ధ్రువపత్రాలు, ఎన్సీసీ, సీఏపీ, పీఎంసీ, ఎస్సీసీఎల్, ఆధార్, ఫొటో, సంతకం తదితర పత్రాలను నిర్దేశించిన పరిమాణంలో అప్లోడ్ చేయాలి. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన బీసీ–ఏ/బీ/ సీ/డీ/ఈ ధ్రువపత్రాలనే పరిగణనలోకి తీసుకుంటారు.
ఓబీసీ ధ్రువపత్రాలు రాష్ట్ర కోటాకు చెల్లవని స్పష్టం చేశారు. అలాగే ఎస్సీ అభ్యర్థులు తప్పనిసరిగా సబ్గ్రూప్ పేర్కొన్న కుల ధ్రువపత్రం సమర్పించాలి. రిజిస్ట్రేషన్, ధ్రువపత్రాల అప్లోడ్ ఒక్కసారి మాత్రమే చేయాల్సి ఉంటుంది. వెబ్ ఆప్షన్ల నోటిఫికేషన్ను ప్రత్యేకంగా విడుదల చేస్తారు. వెబ్ ఆప్షన్లలో ఎంబీబీఎస్, బీడీఎస్ కళాశాలలకు విడివిడిగా ప్రాధాన్యత క్రమంలో ఎంపికలు నమోదు చేయాలని విశ్వవిద్యాలయం సూచించింది.
రిజిస్ట్రేషన్కు సంబంధించిన ముఖ్యాంశాలు
» తెలంగాణ స్థానికత నిబంధనలు తప్పనిసరి; ఇతర రాష్ట్రాల డొమిసైల్ అభ్యర్థులు రాష్ట్ర కోటాకు అర్హులు కారు.
» రాష్ట్ర కోటాలో రిజర్వేషన్లు ఎస్సీ 15%, ఎస్టీ 10%, బీసీ 29%. మహిళలకు ప్రతి కేటగిరీలో 33⅓ శాతం సీట్ల హామీ
» ప్రత్యేక రిజర్వేషన్లు: దివ్యాంగులకు 5%, సీఏపీ 1%, పోలీసు అమరవీరుల పిల్లలకు 0.25%.
» ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ప్రత్యేకంగా అనుమతించిన 7 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో మాత్రమే అమలు.
» సింగరేణి ఉద్యోగుల పిల్లలకు రామగుండం ప్రభుత్వ వైద్య కళాశాలలో 5% రిజర్వేషన్.
» ఎన్సీసీ అభ్యర్థులకు 3% నుంచి 7% వరకు గ్రేస్ మార్కులు.
» ఎంపికైన అభ్యర్థులు రూ.12 వేల యూనివర్సిటీ ఫీజు చెల్లించాలి.
» కోర్సు మధ్యలో మానేస్తే రూ.20 లక్షల డిస్కంటిన్యూయేషన్ బాండ్ అమల్లో ఉంటుంది.
» మొబైల్కు బదులుగా డెస్క్టాప్ లేదా ల్యాప్టాప్ ద్వారా దరఖాస్తు చేయాలని వర్సిటీ సూచించింది.


