
రేప్ కేసు పెట్టొద్దని ఫ్యామిలీని బంధించారు
ఉత్తరప్రదేశ్లో దారుణ ఘటన వెలుగుచూసింది.
బహ్రైచ్: ఉత్తరప్రదేశ్లో దారుణ ఘటన వెలుగుచూసింది. ఏడేళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడటమే కాకుండా.. కేసు పెట్టొద్దంటూ బాధితురాలి కుటుంబాన్ని గదిలో బంధించాడు. ఈ వ్యవహారంలో గ్రామపెద్ద సదరు యువకుడికి అనుకూలంగా వ్యవహరించడం విశేషం.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 18న బహ్రైచ్ గ్రామంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై షిబు(24) అత్యాచారానికి పాల్పడ్డాడు. జరిగిన దారుణాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో.. కేసు పెట్టడానికి వెళ్తున్న వారిని షిబుతో పాటు గ్రామపెద్ద షబ్బాన్ బలవంతంగా ఆపటమే కాకుండా వారిని గదిలో బంధించి రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు ఆదివారం బాధితకుటుంబాన్ని విడిపించారు. అత్యాచారానికి పాల్పడిన యువకుడితో పాటు గ్రామపెద్దపై కేసునమోదు చేసి విచారణ జరుపుతున్నారు.