జమ్మూకాశ్మీర్ సరిహద్దుల్లో బారాముల్లా జిల్లా యూరీ సెక్టార్లో జరిగిన ఎన్కౌంటర్పై కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ప్రకటన చేశారు.
శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్ సరిహద్దుల్లో బారాముల్లా జిల్లా యూరీ సెక్టార్లో జరిగిన ఎన్కౌంటర్పై కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ప్రకటన చేశారు. దాడికి పాల్పడ్డ ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చామని, బంకర్లో ఉన్న మిగిలినవారిని కూడా ఏరివేస్తామని పారికర్ చెప్పారు. తీవ్రవాదుల దాడిలో ఏడుగురు జవాన్లు, ముగ్గురు పోలీసులు మరణించినట్టు తెలిపారు.
శుక్రవారం ఉదయం ఉగ్రవాదులు పోలీసులపై కాల్పులు జరుపుతూ, యూరీ సెక్టార్లోని ఓ బంకర్లోకి చొరబడ్డారు. వారిని బయటకు రప్పించడానికి సైనికులు రంగంలోకి దిగారు. బంకర్లో భారీ ఆయుధాలతో ఉగ్రవాదులు నక్కి ఉన్నట్లు అధికారులు చెప్పారు. ఎంతమంది ఉన్నారన్న విషయాన్ని అధికార్లు వెల్లడించలేకపోతున్నారు. ఉగ్రవాదులు ఉన్న బంకర్ను దిగ్బంధం చేసినట్లు చెప్పారు.