న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడికి దీటుగా బదులిస్తామన్న భారత్ మాట నిలబెట్టుకుంది. 40 మంది జవాన్లను పొట్టనబెట్టుకున్న జైషే ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా భారత వాయుసేన మంగళవారం తెల్లవారుజామున మెరుపు దాడులు చేసింది. 12 మిరాజ్-2000 జెట్ ఫైటర్స్తో చేపట్టిన సర్జికల్ స్ట్రైక్-2 విజయవంతంగా పూర్తి చేసి... దాదాపు 200 నుంచి 300 మంది ఉగ్రవాదలను హతమార్చినట్లు సమాచారం. ఈ క్రమంలో అమర జవాన్లకు ఘనమైన నివాళి అర్పించారంటూ భారత వాయుసేనపై ప్రశంసలు కురుస్తున్నాయి.
సర్జికల్ స్ట్రైక్స్పై పలువురు ప్రతిపక్ష నేతలు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. భారత వైమానిక దళ పైలట్లకు సలాం అంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్వీట్ చేయగా.. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ... భారత వైమానిక దళాన్ని(ఇండియన్ ఎయిర్ఫోర్స్) అమేజింగ్ ఫైటర్స్గా అభివర్ణించారు. ఈమేరకు..‘ ఐఏఎఫ్ అంటే ఇండియాస్ అమేజింగ్ ఫైటర్స్. జై హింద్’ అని ట్వీట్ చేశారు. ఇక ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్... ‘పాక్ ఉగ్రవాదులపై దాడి చేసి ఇంతటి సాహసాన్ని ప్రదర్శించి మనల్ని గర్వపడేలా చేసిన భారత వాయుసేన పైలట్లకు సెల్యూట్ చేస్తున్నా’ అని ప్రశంసించారు.