మహారాష్ట్రలో 2710కి చేరిన కోవిడ్‌ మృతుల సంఖ్య

Maharashtra Reports 123 Deceased Of Covid 19 Fresh Cases 2933 - Sakshi

ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్‌ విలయతాండవం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 123 మంది కరోనా పేషెంట్లు మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో కోవిడ్‌ మరణాల సంఖ్య 2710కి చేరుకుంది. అదే విధంగా ఒక్కరోజులోనే 2933 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో  కరోనా బాధితుల సంఖ్య 77,793కు చేరింది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటన విడుదల చేసింది.  కాగా రాజధాని ముంబైలో 44,931 మంది ప్రాణాంతక కరోనా బారిన పడగా.. నగరంలోని అతిపెద్ద స్లమ్‌ ధారావిలో కొత్తగా 23 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. అక్కడ మొత్తంగా 1872 మందికి కరోనా సోకింది. (తబ్లిగీ జమాత్‌ సభ్యులకు కేంద్రం షాక్‌!)

ఇక బుధవారం నాటికి రాష్ట్రంలో 33,681 మంది కోలుకోగా.. 41,402 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 5 లక్షల మందికి పైగా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.  ఇదిలా ఉండగా.. తమిళనాడులోనూ మహమ్మారి విజృంభిస్తోంది. గురువారం ఒక్కరోజే అక్కడ 1384 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 12 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తంగా కోవిడ్‌ మృతుల సంఖ్య 220కి చేరగా.. కరోనా సోకిన వారి సంఖ్య 27 వేలు దాటింది.(కనీసం నాలుగు లక్షల కోట్ల నష్టం)

మరోవైపు.. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వ్యాప్తి తీవ్రతరమవుతోంది. ఈ క్రమంలో మరో ఐదు ప్రాంతాలను కంటైన్మెంట్‌ జోన్లుగా ప్రభుత్వం గురువారం ప్రకటించింది. దీంతో అక్కడ మొత్తం కంటైన్మెంట్‌ జోన్ల సంఖ్య 163కి చేరింది. ఇ​క దేశవ్యాప్తంగా గురువారం ఒక్కరోజే 9304 కోవిడ్‌ కేసులు నమోదు కాగా.. మొత్తం కేసుల సంఖ్య 2,16,919కు చేరుకుంది. దీంతో అత్యధిక కరోనా కేసులు ఉన్న దేశాల జాబితాలో భారత్‌ ఏడో స్థానంలో నిలిచింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top