మధ్యప్రదేశ్ హోటల్లో సంభవించిన పేలుడు ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు రెండు లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం అందజేస్తామని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు.
జబువా: మధ్యప్రదేశ్ హోటల్లో సంభవించిన పేలుడు ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు రెండు లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం అందజేస్తామని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు. ఈ ప్రమాదంలో గాయపడినవారికి రూ. 50వేలు ఇవ్వనున్నట్టు తెలిపారు.
జబువా జిల్లా కేంద్రంలోని ఒక రెస్టారెంటులో గ్యాస్ సిలిండర్ లీకై.. పేలిపోవడంతో పైన ఉన్న రెండు అంతస్తులు కుప్పకూలాయి. ఈ సంఘటనలో ఇప్పటి వరకు 82 మంది మృతిచెందినట్టు సమాచారం. పేలుడు కంటే, భవన శిథిలాల కింద చిక్కుకుపోయి మరణించిన వారి సంఖ్యే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. రెస్టారెంట్ గ్రౌండ్ ఫ్లోర్ లోని వంటగదిలో పేలుడు జరగటంతో... మొదటి, రెండో అంతస్తు కూలిపోయింది.
దీంతో హోటల్లో ఉన్నవారు శిథిలాల కింద చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని ఫైరింజన్లతో మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు రెస్టారెంట్ భవనం కూలి పక్కనే ఉన్న భవనాలపై పడటంతో.. రెండు భవనాలు కూడా ఒరిగినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించారు.