CoronaVirus Outbreak: Kerala Govt Announces Lockdown Relaxation Plan Based on Zone Wise | లాక్‌డౌన్‌ సడలింపు, కేరళ కీలక ఆదేశాలు - Sakshi
Sakshi News home page

లాక్‌డౌన్‌ సడలింపు: కేరళ కీలక ఆదేశాలు

Apr 18 2020 4:26 PM | Updated on Apr 18 2020 5:05 PM

Kerala Government Guidelines To Reopen State Covid 19 Lockdown - Sakshi

తిరువనంతపురం: కరోనా వైరస్‌(కోవిడ్‌-19) వ్యాప్తిని కట్టడి చేసేందుకు విధించిన లాక్‌డౌన్‌ను సోమవారం నుంచి పాక్షికంగా సడలించనున్న నేపథ్యంలో కేరళ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా తీవ్రత ఆధారంగా జిల్లాలను రెడ్‌, ఆరెంజ్ ఏ, ఆరెంజ్‌ బీ, గ్రీన్‌ జోన్లుగా విభజిస్తూ అక్కడ పాటించాల్సిన నిబంధనలపై మార్గదర్శకాలు విడుదల చేసింది. కాసర్‌గడ్‌, కన్నూరు, మలప్పురం, కోజికోడ్‌ జిల్లాలను రెడ్‌ జోన్‌ కింద పరిగణిస్తూ... ఆయా చోట్ల లాక్‌డౌన్‌ నిబంధనలు యథాతథంగా అమలవుతాయని పేర్కొంది. ఈ నాలుగు జిల్లాల్లో ఎటువంటి రంగాలకు కూడా నిబంధనల నుంచి మినహాయింపు లేదని స్పష్టం చేసింది. హాట్‌స్పాట్లను సీల్‌ చేసి ఉంచుతామని.. కేవలం నిత్యావసర వస్తువుల కోసం మాత్రమే రెండు మార్గాలు తెరచి ఉంచుతామని పేర్కొంది.(కరోనా నెగిటివ్‌ వచ్చిన వృద్ధుడు మృతి..).

ఇక మిగతా జిల్లాల్లో సరి- బేసి విధానం(అత్యవసర సేవలకు మాత్రమే)లో ప్రైవేటు వాహనాలను రోడ్ల మీదకు అనుమతిస్తామని పినరయి విజయన్‌ ప్రభుత్వం వెల్లడించింది. అదే విధంగా రెస్టారెంట్లను రాత్రి ఏడు గంటల వరకు నిర్వహించుకునేందుకు అనుమతినివ్వనున్నట్లు తెలిపింది. స్వల్ప దూర ప్రయాణాల కోసం అంతర్‌జిల్లాలో బస్సులు నడుపనున్నట్లు పేర్కొంది. అయితే ప్రతీ ఒక్కరు కచ్చితంగా భౌతిక దూరం పాటించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.(కేరళ సీఎం కీలక నిర్ణయం)

కాగా పతనంతిట్ట, ఎర్నాకులం, కొల్లాం జిల్లాలను ఆరెంజ్‌ ఏ జోన్‌లో చేర్చిన ప్రభుత్వం.. ఏప్రిల్‌ 24 నుంచి అక్కడ లాక్‌డౌన్‌ నిబంధనలను పాక్షికంగా సడలించనున్నట్లు తెలిపింది. ఇక ఆరెంజ్‌ బీ జోన్‌లోని అలప్పుజ, తిరువనంతపురం, పాలక్కాడ్‌, వయనాడ్‌, త్రిసూర్‌ జిల్లాలో సోమవారం నుంచే నిబంధనలు సడలిస్తున్నట్లు వెల్లడించింది. కొట్టాయం, ఇడుక్కి జిల్లాలను గ్రీన్‌ జోన్‌ కిందకు తెచ్చిన విజయన్‌ సర్కారు.... సోమవారం నుంచి అక్కడ లాక్‌డౌన్‌ నిబంధనలు ఎత్తివేయనన్నుటు పేర్కొంది.

ఆరెంజ్‌ జోన్‌లో సడలింపులు ఇలా..

  • అత్యవసర సమయాల్లో బేసి సంఖ్య నంబరు ప్లేట్లు కలిగిన వాహనాల(ప్రైవేటు)కు సోమ, బుధ, శుక్ర వారాల్లో అనుమతి
  • సరి సంఖ్య నంబరు ప్లేట్లు కలిగిన వాహనాలకు మంగళ, గురు, శని వారాల్లో అనుమతి.. ఇక ఒక్కరే లేదా ఒ‍కరి తోడుతో ప్రయాణించే మహిళలకు ఈ నిబంధనలు వర్తించవు
  • డ్రైవర్‌తో పాటు ఇద్దరు ప్యాసింజర్లు మాత్రమే కార్లలో ప్రయాణించాలి. టూ వీలర్‌లో ఒక్కరే వెళ్లాలి.
  • మాస్కులు తప్పక ధరించాలి. శానిటైజర్లు వాడాలి. బస్సుల్లో ప్రయాణించే వారికి వీటిని అందుబాటులో ఉంచుతాం
  • శని, ఆదివారాల్లో బార్బర్‌ షాపులు తెరుస్తారు. ఏసీ వాడకూడదు. కేవలం ఇద్దరికి మాత్రమే ఒకేసారి క్షవరం చేయవచ్చు.
  • రాత్రి 7 గంటల వరకు రెస్టారెంట్ల నిర్వహణ
  • ఆరోగ్య సేవా సంస్థల కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయి
  • 15 రోజులకొకసారి అంగన్‌వాడీ కార్యకర్తల ద్వారా లబ్దిదారుల ఇంటికే పౌష్టికాహార పంపిణీ 
  • నిబంధనలు పాటిస్తూ గ్రామీణ ఉపాధి పనుల కొనసాగింపు
  • దగ్గు, జ్వరం లేని వాళ్లు మాత్రమే పనిలోకి రావాలి. విధిగా కార్మికులకు చెకప్‌ చేయించాలి.

గ్రీన్‌ జోన్‌ పరిధిలో..

  • దేశీయ, అంతర్జాతీయ వైమానిక ప్రయాణాలు నిషిద్ధం
  • రైళ్ల రాకపోకలు బంద్‌
  • మెట్రో సర్వీసులు మూసివేత
  • సినిమా హాళ్లు, మాళ్లు, షాపింగ్‌ కాంప్లెక్సులు, స్విమ్మింగ్‌ పూల్స్‌ తదితర ప్రదేశాలు మూసి ఉంచాలి
  • బహిరంగ సమావేశాలు నిషిద్ధం
  • మతపరమైన స్థలాలు మూసివేత
  • పెళ్లిళ్లు, అంత్యక్రియలకు హాజరయ్యే వారి సంఖ్య 20 లోపు ఉండాలి. ఇందుకు అనుమతి తీసుకోవాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement