
సాక్షి,న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పీ చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం ఎయిర్సెల్ మాక్సిస్ కేసులో సీబీఐ తనకు సమన్లు జారీ చేయడంపై సుప్రీం కోర్టును ఆశ్రయించారు.ఈ కేసుకు సంబంధించి బుధవారం తమ ఎదుట హాజరు కావాలని సీబీఐ కార్తీకి సమన్లు జారీ చేసింది. అయితే విచారణలో తాను హాజరు కావాలని ఒత్తిడి చేయవద్దని తన న్యాయవాది ద్వారా ఆయన సీబీఐకి స్పష్టం చేశారు.
ఈ కేసులో తనను ప్రశ్నించేందుకు సీబీఐ సమన్లు జారీ చేయడం అక్రమమని, తనను తన కుటుంబాన్ని వేధించేందుకేనని కార్తీ పేర్కొన్నారు.సీబీఐ సమన్లను సవాల్ చేస్తూ కార్తీ చిదంబరం రాజ్యాంగంలోని 32వ ఆర్టికల్ ప్రకారం సర్వోన్నత న్యాయస్ధానంలో పిటిషన్ దాఖలు చేశారని కార్తీ న్యాయవాది పేర్కొన్నారు.
ఇదే కేసుకు సంబంధించి కార్తీ, ఆయమ తండ్రిని 2014 నవంబర్, డిసెంబర్లలో సీబీఐ విచారించిందని ఆయన గుర్తుచేశారు.ఈ కేసులో నిందితులందరిపై అభియోగాలను తోసిపుచ్చిన క్రమంలో సీబీఐ సమన్లు జారీ చేయడం అర్ధరహితమని కార్తీ న్యాయవాది అన్నారు.