అయోధ్య తీర్పుపై రివ్యూ పిటిషన్‌

Jamiat Ulema E Hind Files Review Plea Over Ayodhya Verdict - Sakshi

న్యూఢిల్లీ : అయోధ్యలోని వివాదస్పద స్థలంపై సుప్రీం కోర్టు తీర్పును సవాలు చేస్తూ రివ్యూ పిటిషన్‌ దాఖలైంది. జమైత్ ఉలేమా ఇ హింద్ సంస్థ సోమవారం సుప్రీం కోర్టులో ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది. రివ్యూ పిటిషన్‌ దాఖలు చేయడంపై ఆ సంస్థ చీఫ్‌ మౌలానా అర్షద్ మదాని మాట్లాడుతూ.. దేశంలోని మెజారిటీ ముస్లింలు అయోధ్య పై సుప్రీం వెలువరించిన తీర్పుకు వ్యతిరేకంగా ఉన్నారని తెలిపారు. కొందరు మాత్రమే రివ్యూ పిటిషన్‌ వద్దనుకుంటున్నారని చెప్పారు. అయోధ్య తీర్పుపై రివ్యూ పిటిషన్‌ దాఖలు చేయడం కోర్టు తమకు ఇచ్చిన హక్కు అని పేర్కొన్నారు. 

అయోధ్య కేసులో.. మందిరాన్ని కూల్చి మసీదును నిర్మించారనేది వివాదస్పద అంశమని ఆర్షద్‌ తెలిపారు. కానీ ఆ ఆరోపణలకు ఆధారాలు లేవని కోర్టు కూడా చెప్పిందని అన్నారు. కానీ తీర్పు మాత్రం అందుకు వ్యతిరేకంగా వెలువడిందన్నారు. అందువల్లే తాము రివ్యూ పిటిషన్‌ దాఖలు చేస్తున్నట్టు తెలిపారు. కాగా, సుప్రీం అయోధ్య కేసులో తీర్పు వెలువరించిన తరువాత దాఖలైన తొలి రివ్యూ పిటిషన్‌ ఇదే.

మరోవైపు 99 శాతం ముస్లింలు అయోధ్య తీర్పుపై రివ్యూ పిటిషన్‌ వేయాలని కోరుకుంటున్నారని ఆల్‌ ఇండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డ్‌(ఏఐఎంపీఎల్‌బీ) ఆదివారం పేర్కొంది.  డిసెంబర్‌ 9 వ తేదీన రివ్యూ పిటిషన్‌ దాఖలు చేస్తామని ఏఐఎంపీఎల్‌బీ వెల్లడించింది. అయితే ముస్లింల తరఫున పిటిషన్‌దారు అయిన సున్నీ వక్ఫ్‌ బోర్డు అయోధ్య తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయబోమని స్పష్టం చేసింది.

కాగా, అత్యంత సున్నితమైన అయోధ్య కేసులో సుప్రీం కోర్టు నవంబర్‌ 9వ తేదీన కీలక తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. అయోధ్యలో వివాదాస్పదంగా మారిన 2.77 ఎకరాల భూమి హిందువులకే చెందుతుందని సుప్రీం కోర్టు ఆ తీర్పులో పేర్కొంది. రామ మందిర నిర్మాణం కోసం మూడు నెలల్లో అయోధ్య ట్రస్ట్‌ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది.  అలాగే మసీదు నిర్మాణానికి అయోధ్యలోనే సున్నీ వక్ఫ్‌ బోర్డుకు 5 ఎకరాల స్థలం కేటాయించాలని స్పష్టం చేసింది.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top