‘ఐఎస్ఐఎస్.. నిజమైన ముస్లిం సంస్థ’
తిరువనంతపురం : కేరళలో అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ ఆనవాళ్లు మరోసారి బయటపడ్డాయి. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న ఐదుగురిని పోలీసులు కానూర్లో అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అరెస్ట్ చేసినవారిలో.. ఐఎస్ఐఎస్కు యువకులను రిక్రూట్, ట్రైనర్గా పనిచేస్తున్న తాలిబన్ హమ్సా కూడా ఉన్నారు. వీరిని ఇంటరాగేషన్ చేస్తున్న సమయంలో తాలిబన్ హమ్సా షాకింగ్కు గరి చేసే విషయాలను చెప్పారని పోలీసులు పేర్కొంటున్నారు. ఐఎస్ఐఎస్ నిజమైన ముస్లిం సంస్థ అని.. ముస్లింల కోసం వాస్తవంగా పనిచేసే ఏకైక సంస్థ అదొక్కటేనని తాలిబన్ హమ్సా నిర్భయంగా చెప్పినట్లు పోలీసులు తెలిపారు.
గల్ఫ్ దేశాల నుంచి హమ్సా తన కార్యక్రమాలను 1998 నుంచి నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పీపీ పద్మనాభన్ తెలిపారు. బహ్రెయిన్లోని మత సంస్థ ఏఐ అన్సర్తో కలిసి ఐఎస్ఐఎస్ ఉగ్రవదులకు శిక్షణ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. తాలిబన్ హమ్సా ప్రసంగాలకు ఆకర్షితులైన పలువురు కేరళ యువకులు ఐఎస్ఐఎస్లో చేరినట్లు ఆయన చెప్పారు.
ఇప్పటివరకూ పోలీసులు హమ్సాతో పాటుగా, మునాఫ్ రెహమాన్, మిథిల్రాజ్, అబ్దుల్ రజాక్, రషీద్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఐఎస్ఐఎస్ అనుమానితులగా భావిస్తున్న అందరినీ నేషనల్ ఇన్వెస్టిగేషన్ అథారిటీతో కలిసి విచారిస్తున్నట్లు ఆయన తెలిపారు. భారత్ నుంచి సుమారుగా వంద మంది ఐఎస్ఐఎస్తో కలిసి సిరియా, ఇరాక్లలో పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.