విదేశీ జైళ్లల్లో అత్యధికంగా భారతీయులే

Indian Prisoners Top In Abroad Jails - Sakshi

న్యూఢిల్లీ : సౌదీ అరేబియాలో జైలు శిక్ష అనుభవిస్తున్న విదేశీయులలో భారతీయులు మొదటి స్థానంలో ఉన్నారని విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్‌ జయశంకర్‌ తెలిపారు. ఈ ఏడాది మే 31 నాటికి సౌదీలోని భారతీయ ఖైదీలు 6శాతం మేర పెరిగినట్లు పేర్కొన్నారు. ఈ జాబితాలో సౌదీ తర్వాత యుఏఈ, నేపాల్‌లో అత్యధిక మంది భారతీయులు అక్కడి జైళ్లలో బంధీలుగా ఉన్నారన్నారు. సౌదీ అరేబియాలో మొత్తంగా 1,811, యుఏఈలో 1,392, నేపాల్‌లో 1,160 మంది భారతీయులు జైళ్లలో మగ్గుతున్నారని తెలిపారు. ఇక అమెరికా జైళ్లలో 689, పాకిస్తాన్‌లో 48 మంది భారతీయులు ఖైదీలుగా ఉన్నారన్నారు. పాకిస్తాన్ జైళ్లలో గత ఏడాది 471 మంది భారతీయులు ఉండగా.. ఈ ఏడాది వారి సంఖ్య బాగా తగ్గిందని గణాంకాలు తెలియజేస్తున్నాయి. కాగా బుధవారం లోక్‌సభలో ఒక ఎంపీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి ఈ గణాంకాలు వెల్లడించారు. ఈ మేరకు ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది.

విదేశాల్లోని చట్టాలపై సరైన అవగాహన లేకుండా అక్కడికి వెళ్తున్న కారణంగా అత్యధిక మంది ఇబ్బందుల్లో పడుతున్నారని పేర్కొంది. ఈ క్రమంలో జైళ్లలో మగ్గాల్సి వస్తుందని.. అయితే విదేశాల్లో పని చేయాలనుకునే కార్మికులు స్థానిక కాన్సులేట్‌ సేవలలో ముందుగానే తమ పేరును  నమోదు  చేసుకోవడం ద్వారా ఈ సమస్యలను అధిగమించవచ్చని తెలిపింది. కాగా సాధారణంగా తమ దేశంలో ఉన్న ఖైదీల విషయంలో చాలా మటుకు దేశాలు వివరాలు ప్రకటించడంలో గోప్యత పాటిస్తాయన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా దాయాది దేశాల్లో బంధీలుగా ఉన్న పౌరుల వివరాలు.. అనేక వేధింపుల తరువాత బహిర్గతమవుతాయన్న అంశం విదితమే.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top