2050 నాటికిమలేరియాకు చెక్‌

India ranked fourth in global malaria cases in 2017 - Sakshi

ప్రస్తుతం ప్రపంచంలో నాలుగో స్థానంలో భారత్‌

లాన్‌సెట్‌ నివేదిక వెల్లడి  

ప్రపంచ దేశాలను వణికిస్తున్న మలేరియా వ్యాధిని పూర్తిగా నిర్మూలించడానికి మరో 30 సంవత్సరాలు పడుతుందని లాన్‌సెట్‌ జర్నల్‌లో ప్రచురితమైన నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న సగం దేశాలు మలేరియా నుంచి విముక్తి పొందాయని మిగిలిన దేశాల్లో 2050 నాటికి ఈ వ్యాధిని అరికట్టవచ్చునని ఆ నివేదిక తెలిపింది. 2017లో మలేరియా కేసుల్లో ప్రపంచంలో భారత్‌ నాలుగో స్థానంలో ఉందని ఆ నివేదిక తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా నమోదైన కేసుల్లో 4 శాతం భారత్‌కు చెందినవే కావడం ఆందోళన పుట్టిస్తోంది.  

నివేదిక ఎలా ?
ప్రపంచవ్యాప్తంగా మలేరియా వ్యాధి నిర్మూలనకు పరిశోధనలు చేస్తున్న నిపుణులు, బయోమెడికల్‌ శాస్త్రవేత్తలు, ఆర్థికవేత్తలు, ఆరోగ్య నిపుణులు మొత్తం 40 మంది అభిప్రాయాలను తీసుకున్నారు. వివిధ దేశాల ప్రభుత్వాలు వ్యాధి నిర్మూలనకు అమలు చేస్తున్న వ్యూహాలు, కేటాయిస్తున్న నిధులు వంటివి క్రోడీకరించి, విశ్లేషించి ఈ నివేదికను రూపొందించారు.

నివేదిక ఏం చెప్పిందంటే
► 2017లో ప్రపంచంలో 21.9 కోట్ల మలేరియా కేసులు వెలుగులోకి వస్తే, అందులో కోటి కేసులు భారత్‌లో నమోదయ్యాయి. అందులోనూ 71 శాతం తమిళనాడులో నమోదయ్యాయి.  
► భారత్‌కు చెందిన పట్టణాల్లో మలేరియా వ్యాధికారక దోమలు వృద్ధి చెందడానికి అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయి.  
► భారత్‌లో పట్టణీకరణ కారణంగా నిర్మాణాలు జరిగే ప్రాంతాలు, చెరువులు, కాల్వలు వంటి చోట్ల దోమలు బాగా వృద్ధి చెంది మలేరియా వ్యాపిస్తోంది.  
► భారత్‌లో ఆరోగ్యానికి ప్రజలు తమ జేబుల్లో డబ్బులు ఖర్చు పెట్టడం వల్ల కూడా మొండి వ్యాధులు దూరం కావడం లేదు.  
► 2000 సంవత్సరం తర్వాత మలేరియా వ్యాధి మరణాలు 60 నుంచి 36 శాతానికి తగ్గిపోయాయి.  
► నిధుల కొరత కారణంగ్లా ఆఫ్రికా, ఆసియా, లాటిన్‌ అమెరికాకు చెందిన 55 దేశాల్లో మలేరియా విజృంభిస్తోంది.  
► ఇప్పటికీ ప్రతీ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల మలేరియా కేసులు నమోదవుతున్నాయి. 50 వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు
► 2017లో మొత్తం మరణాల్లో 85శాతం 25 దేశాల్లోనే నమోదయ్యాయి.  
► పేదరికం కారణంగా మలేరియా నిర్మూలనకు నిధులు కేటాయించలేక ఆఫ్రికా దేశాల్లో ఇంకా మరణాలు సంభవిస్తున్నాయి.  
► ప్రాంతాలవారీగా, దేశాల వారీగా, అంతర్జాతీయంగా పటిష్టమైన చర్యల్ని తీసుకుంటేనే ఈ మహమ్మారిని పూర్తిగా నిర్మూలించగలం
► ప్రపంచ దేశాలన్నీ ప్రతీ ఏడాది 200 కోట్ల అమెరికా డాలర్ల నిధులు కేటాయిస్తేనే మలేరియా నిర్మూలన సాధ్యమవుతుంది.
► ప్రస్తుత ఆవిష్కరణలను బట్టి  2050 నాటికి ఈ వ్యాధి ఆఫ్రికా ఖండంలో కొన్ని దేశాల్లో తప్ప మిగిలిన చోట్ల ఎక్కడా కనిపించదు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top