ట్రై చేస్తే పీవోకే భారత్‌దే.. ఎవరూ అడ్డుకోలేరు! | I condemn Farooq Abdullah statement on PoK, says Hansraj Ahir | Sakshi
Sakshi News home page

Nov 16 2017 1:38 PM | Updated on Nov 16 2017 1:38 PM

I condemn Farooq Abdullah statement on PoK, says Hansraj Ahir - Sakshi

న్యూఢిల్లీ: పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే) పాకిస్తాన్‌దేనంటూ నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ అధ్యక్షుడు ఫరూక్‌ అబ్దుల్లా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హన్స్‌రాజ్‌ అహిర్‌ ఖండించారు. పీవోకే భారత్‌దేనని, గత ప్రభుత్వాలు చేసిన పొరపాట్ల వల్ల ఈ ప్రాంతం పాక్‌ ఆధీనంలోకి వెళ్లిపోయిందని ఆయన అన్నారు. ’ మనం ప్రయత్నిస్తే పీవోకే మళ్లీ మన సొంతం అవుతుంది. ఎందుకంటే అది మన హక్కు. పీవోకే తిరిగి మనం అధీనంలోకి తెచ్చుకునేందుకు మేం కృషి చేస్తాం’ అని హన్స్‌రాజ్‌ తెలిపారు.

ఫరూక్‌ వివాదాస్పద వ్యాఖ్యలివే..!
పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే) పాకిస్తాన్‌దే అంటూ గతవారం వ్యాఖ్యలు చేసిన ఫరూక్‌ అబ్దుల్లా మరోసారి వివాదాస్పదంగా మాట్లాడారు. పీవోకేను భారత్‌ ఆక్రమించుకునే అవకాశం ఇచ్చేంత బలహీన దేశం పాక్‌ కాదని ఆయన బుధవారం అన్నారు. బారాముల్లా జిల్లాలోని ఉడీ ప్రాంతంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి అబ్దుల్లా ప్రసంగించారు. ‘ఇంకా ఎంత కాలం పీవోకే మనదేనని ఈ దేశం చెప్పుకుంటూ ఉంటుంది? అది వీళ్ల అబ్బ సొత్తేమీ కాదు. పీవోకే పాకిస్తాన్‌దే. జమ్మూ కశ్మీర్‌ భారత్‌ది. 70 ఏళ్లయినా పీవోకేను భారత్‌ తన అధీనంలోకి తెచ్చుకోలేకపోయింది.

కానీ స్వాధీనం చేసుకుంటామని చెబుతూనే ఉంది. ఇది ఎలా జరగుతుందో మేమూ చూస్తాం. పాకిస్తాన్‌ ఏమీ బలహీన దేశం కాదు.వాళ్లు గాజులు తొడుక్కోలేదు. వాళ్ల దగ్గరా అణుబాంబులు ఉన్నాయి. యుద్ధం గురించి ఆలోచించేముందు మనుషులుగా బతకడం గురించి ఆలోచించాలి’ అని అబ్దుల్లా అన్నారు. నియంత్రణ రేఖ వద్ద ఇరుదేశాల ప్రజలు స్వేచ్ఛగా తిరిగే రోజు వస్తుందని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు. జమ్మూకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి, అక్కడి ప్రజలకు ప్రత్యేక వెసులుబాట్లు, రాయితీలు తదితరాలు కల్పిస్తూ 1953లో తెచ్చిన చట్టాలన్నింటినీ తొలగించే కాలం కూడా వచ్చిందంటూ కేంద్ర ప్రభుత్వంపై ఆయన ఆరోపణలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement