చెన్నైలో భారీ వర్షం
సాక్షి, చెన్నై : గత కొన్నిరోజులుగా తాగునీరు సైతం దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్న చెన్నైని వరణుడు కరుణించాడు. గంటన్నరపాటు సోమవారం కుండపోతగా వర్షం కురవడంతో నగరంలోని పలు రహదారులు జలమయం అయ్యాయి. వర్షం రాకతో నగర ప్రజలు ఆనంద వ్యక్తం చేస్తున్నారు. నీటి కష్టాలు కొంచెమైనా తీరుతాయని అంటున్నారు. జూన్ నెలలోనే నైరుతీ రుతుపవనాలు వచ్చినా ఆశించినంత వర్షం కురవకపోవడంతో అప్పటికే నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న చెన్నై వాసుల కష్టాలు ఇంకా తీవ్రం అయ్యాయి. దీంతో ప్రభుత్వం నగరానికి 200 కిలోమీటర్ల దూరం నుంచి రైళ్ల ద్వారా నీటి సరఫరా చేస్తోంది. అయితే ఈ నీళ్లు వారి తాగునీటి కష్టాలను ఏమాత్రం తీర్చలేకపోయాయి. ఇప్పట్లో వర్షం కురవకపోతే చెన్నై వాసులను ఆ భగవంతుడే రక్షించాలని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు తాజాగా భారీ వర్షం కురవడంతో వారి ఆనందానికి హద్దులు లేకుండా పోతోంది. భూగర్భ జలాలు పెరిగి నీటి సమస్య తీరుతుందని భావిస్తున్నారు.