బీజేపీపై మాయావతి ఫైర్ | Haryana govt insensitive towards Dalits: Mayawati | Sakshi
Sakshi News home page

బీజేపీపై మాయావతి ఫైర్

Oct 23 2015 12:57 PM | Updated on Mar 29 2019 9:31 PM

బీజేపీపై మాయావతి ఫైర్ - Sakshi

బీజేపీపై మాయావతి ఫైర్

భారతీయ జనతా పార్టీపై బీఎస్పీ అధినేత్రి మాయావతి మండిపడ్డారు. దళితులపై దాడులు జరుగుతున్నా హరియాణాలోని బీజేపీ ప్రభుత్వ మొద్దు నిద్రపోతుందని ఆరోపించారు.

లక్నో: భారతీయ జనతా పార్టీపై బీఎస్పీ అధినేత్రి మాయావతి మండిపడ్డారు. దళితులపై దాడులు జరుగుతున్నా హరియాణాలోని బీజేపీ ప్రభుత్వ మొద్దు నిద్రపోతుందని ఆరోపించారు. ఇద్దరు దళిత చిన్నారులను సజీవ దహనం చేసినటువంటి ఘటనలు జరగడం ఆ ప్రభుత్వానికి సిగ్గు చేటని అన్నారు. హరియాణాలో ఈ వారం ప్రారంభంలో అగ్రవర్ణానికి చెందిన వ్యక్తులు ఓ దళిత కుటుంబాన్ని సజీవ దహనం చేసే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా వారి తల్లి తీవ్ర గాయాలతో ప్రాణాలకోసం కొట్టుమిట్టాడుతోంది. తండ్రికి కూడా గాయాలయ్యాయి.

ఈ ఘటనపట్ల స్పందించేందుకు మాయావతి శుక్రవారం ప్రత్యేక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇది నిజంగా ఓ దిగ్భ్రాంతిని కలిగించే విషయమని, అది కూడా ఎప్పుడూ పోలీసులు తిరుగుతుండే ప్రాంతంలో ఘటన సంభవించడం విస్మయాన్ని కలిగించిందని మాయావతి అన్నారు. పోలీసులు పక్కన ఉండగానే నలుగురు దళితులను సజీవ దహనం చేసే యత్నం చేశారే వారేం నేరం చేశారని నిలదీశారు. వ్యక్తిగత గౌరవంతో బతుకుతున్న ఆ కుటుంబాన్ని ఓర్వలేకనే ఈ దాడి చేశారని ఆరోపించారు.

ఇంకా అక్కడ భూస్వామ్య విధానం కొనసాగుతోందని, దళితులను తమ పొలాల్లో బానిసలుగా పనిచేసేందుకు బలవంత పెడుతున్నారని, అది నచ్చని దళితులు తిరగబడి తమకు తాముగా బతుకుతుంటే భరించలేకే ఇలాంటి దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోని అన్ని చోట్ల కూడా ఇప్పటికీ దళితులపై దాడులు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులు ఏమాత్రం జరగనివ్వబోమని హామీలు ఇచ్చిన బీజేపీ ప్రభుత్వం ఇన్ని ఘటనలు జరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement