ప్రధాని చొరవ.. కోటి రూపాయల పెన్షన్‌

Former Army Officer Wife Pension Restored After 30 Years - Sakshi

జెరూసలేం : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చొరవతో 30 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న పెన్షన్‌ను తిరిగి పునరుద్ధరించనున్నారు. దీంతో 94 ఏళ్ల ఓ వృద్ధురాలికి కోటి రూపాయలు అందనున్నాయి. వివరాలు.. ‘కల్నల్‌ జార్జ్‌ మెంజమిన్‌ భారత ఆర్మీలోని ఇంజనీరింగ్‌ దళంలో సేవలందించారు. 1966లో పదవీ విరమణ పొందారు. అనంతరం సొంత దేశం ఇజ్రాయెల్‌కు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. జార్జ్‌ 1990లో మృతిచెందడంతో ఆయకు ఇస్తున్న పెన్షన్‌ను భారత ప్రభుత్వం నిలిపేసింది. జార్జ్‌ భార్య హెబె సంబంధిత అధికారులకు  ఎన్ని ఉత్తరాలు రాసినా ఫలితం లేకపోయింది. ఇజ్రాయెల్‌లో ఉన్న భారత దౌత్య కార్యాలయాన్ని సంప్రదించినా ఎలాంటి రెస్పాన్స్‌ లేదు. బెంజమిన్‌ కుటుంబం విదేశాల్లో నివసిస్తోందని సాకుగా చూపి పెన్షన్‌ ఆపేశారు. నేను కూడా భారత రక్షణ శాఖకు ఎన్నో ఉత్తరాలు రాశాను. ఎన్నో సార్లు రక్షణశాఖ అధికారులను కలిసినా స్పందించలేదు’ అని బెంజమిన్‌ ఫ్యామిలీ ఫ్రెండ్‌ మనక్రీత్‌ కాంత్‌ తెలిపారు.

తక్షణ చర్యలు ప్రారంభం..
ఇక చివరి ప్రయత్నంగా ప్రధాని మోదీ, రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌, ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌కు లేఖలు రాశామని మనక్రీత్‌ తెలిపారు. 30  ఏళ్లుగా ఆగిపోయిన జార్జ్‌ పెన్షన్‌ను తిరిగి ఇప్పించాలని, ఈ విషయంలో చొరవ తీసుకోవాలని విన్నవించినట్టు చెప్పారు. కాగా, ఈ వ్యవహారంపై దృష్టి సారించిన ప్రధాని కార్యాలయం పెన్షన్‌ పునరుద్ధరణకు తక్షణం చర్యలు తీసుకోవాలని రక్షణశాఖకు మార్గదర్శకాలు జారీ చేసింది. వడ్డీతో సహా ఆర్మీ మాజీ ఆఫీసర్‌ పెన్షన్‌ డబ్బులు చెల్లించాలని పేర్కొంది. వడ్డీతో కలిపి కోటి రూపాయల మొత్తాన్నిజనవరి 31 వరకు జార్జ్‌ భార్యకు అందివ్వనున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top