ఢిల్లీ రోడ్లపై కదలని వాహనాలు | Diesel taxi drivers bring protest and brought the traffic | Sakshi
Sakshi News home page

ఢిల్లీ రోడ్లపై కదలని వాహనాలు

May 3 2016 12:49 PM | Updated on Sep 2 2018 5:24 PM

ఢిల్లీ రోడ్లపై కదలని వాహనాలు - Sakshi

ఢిల్లీ రోడ్లపై కదలని వాహనాలు

ఢిల్లీ రోడ్లపై పెట్రోల్, డీజిల్ క్యాబ్లను అనుమతించబోమంటూ ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేయడంపై క్యాబ్ డ్రైవర్లు సంతృప్తిగా లేరు.

న్యూఢిల్లీ: ఢిల్లీ రోడ్లపై పెట్రోల్, డీజిల్ క్యాబ్లను అనుమతించబోమంటూ ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేయడంపై క్యాబ్ డ్రైవర్లు సంతృప్తిగా లేరు. క్యాబ్స్ తరుపువారు వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేస్తూ మే 1 నుంచి ఎట్టి పరిస్థితుల్లో అలాంటి వాహనాలు అనుమతించబోమని స్పష్టం చేసిన నేపథ్యంలో క్యాబ్ డ్రైవర్లు రోడ్లపై వాహనాలను రెండో రోజు అడ్డుకుంటున్నారు. నగరంలోని ప్రధాన రహదారులు, రోడ్డు మార్గాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మెయిన్ రోడ్ల కూడళ్లలో తమ నిరసన తెలిపితేనే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు తమ గోడును అర్థం చేసుకుంటుందని వారు భావించినట్టు కనిపిస్తోంది. మెహ్రౌలి-బదార్పుర్ రోడ్డు మార్గంలో, కార్కారీకి వెళ్లే మార్గంలో ఉన్న దక్షిణ ఢిల్లీలోని సాకెత్ మెట్రో స్టేషన్ నుంచి రాకపోకలు నిలిచిపోయాయి.

ఢిల్లీ-నోయిడా మార్గం, దౌలా కువాన్, మహిపాల్ పుర్, గుర్గావ్ కు వెళ్లే ఇతర ప్రధాన మార్గాలలో టాక్సీ డ్రైవర్లు తమ నిరసన తెలుపుతూ వాహనాలను అడ్డుకుని దార్లను మూసివేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మంగళవారం ఉదయం నుంచి మళ్లీ తమ నిరసన తెలుపుతున్నారని టాక్సీ డ్రైవర్ల తీరును వివరించారు. డీజిల్, పెట్రోల్ వాహనాలను సీఎన్ జీ వాహనాలుగా మార్చుకునే పరిజ్ఞానం అందుబాటులో లేదని, అందుకే కొంత గడువు ఇవ్వాలని క్యాబ్స్ యజమానులు సుప్రీంకోర్టును అభ్యర్థించగా... ఇప్పటికే చాలినంత సమయం ఇచ్చామని, తమ ఆదేశాలను పాటించి తీరాలని సుప్రీం గట్టిగా మందలించిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement