కరోనా ఎఫెక్ట్‌; అక్కడ పోలీసుల తనిఖీలు | Sakshi
Sakshi News home page

కరోనా ఎఫెక్ట్‌; అక్కడ పోలీసుల తనిఖీలు

Published Mon, Mar 30 2020 7:23 PM

Delhi Police Cordon Off Area in Nizamuddin as People Show Corona Symptoms - Sakshi

సాక్షి, ఢిల్లీ: కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో దేశ రాజధానిలోని నిజాముద్దీన్ ప్రాంతంలో పోలీసుల విస్తృత తనిఖీలు చేపట్టారు. ఢిల్లీ వైద్య శాఖ అధికారుల సహాయంతో దాదాపు 200 మందిని కోవిడ్‌ నిర్ధారణ పరీక్షల కోసం ఆస్పత్రులకు తరలించారు. ఈ ప్రాంతంలో ఏడుగురికి కరోనా పాజిటివ్‌ రావడం, మరికొందరిలో కోవిడ్‌ లక్షణాలు కనబడటంతో ‘నిజాముద్దీన్‌’పై పోలీసులు దృష్టి సారించారు. ఈ ప్రాంతంలో కార్డన్ సర్చ్ చేపట్టి విస్తృత తనిఖీలు చేపట్టారు. నిజాముద్దీన్ ప్రాంతాన్ని డ్రోన్ కెమెరాలతో పోలీసుల జల్లెడ పడుతున్నారు. ప్రార్ధనలకు హాజరైన వారిని వివరాలపై ఆరా తీస్తున్నారు.

మార్చి 10న స్థానిక నిజాముద్దీన్‌ మార్కజ్‌ మసీదులో జరిగిన మత కార్యక్రమానికి మలేసియా, ఇండోనేసియా, సౌదీ అరేబియా, కిర్గిజిస్తాన్‌ దేశాలకు చెందిన యాత్రికులు హాజరయ్యారు. వీరి ద్వారా కరోనా వైరస్‌ స్థానికులకు వ్యాపించినట్టు అనుమానిస్తున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఇద్దరికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఇక్కడికి వచ్చివెళ్లిన మతగరువు గతవారం శ్రీనగర్‌లో మృతి చెందారు. నిజాముద్దీన్‌కు రావడానికి ముందు ఉత్తరప్రదేశ్‌లోని దియోబండ్‌ ప్రాంతంలో ఓ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.

‘రెండు రోజుల క్రితం 30 మందిని కరోనా నిర్ధారణ పరీక్షల కోసం ఢిల్లీ ప్రభుత్వాసుపత్రికి తరలించాం. వీరిలో ఏడుగురికి కరోనా సోకినట్టు నిర్ధారణయింది. నిజాముద్దీన్‌ ప్రాంతం నిత్యం జనంతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో జనాన్ని బృందాల వారీగా కరోనా నిర్ధారణ పరీక్షలకు తరలించాలని నిర్ణయించామ’ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అయితే ఇప్పటివరకు ఎంతమందిని తరలించారనేది కచ్చితంగా వెల్లడించలేదు. (కోవిడ్‌-19: ఖైదీల‌కు శుభ‌వార్త‌)

కాగా, ఇప్పటివరకు ఒక్క కోవిడ్‌-19 కేసు నమోదు కాలేదని నిజాముద్దీన్‌ మార్కజ్‌ మసీదు అధికార ప్రతినిధి డాక్టర్‌ మహ్మద్‌ షోయబ్‌ తెలిపారు. జలుబు, దగ్గుతో సహా ఎటువంటి అనారోగ్య లక్షణాలున్నా అటువంటి వివరాలు ప్రభుత్వాధికారులకు అందజేశామని చెప్పారు. వయసు, ప్రయాణ చరిత్ర(ట్రావెల్‌ హిస్టరీ) ఆధారంగా కొంత మంది ఆస్పత్రుల్లో చేరారని తెలిపారు. (కేజ్రివాల్ ప్ర‌భుత్వం కీలక చ‌ర్య‌లు)

Advertisement
Advertisement