రికార్డు బ్రేక్‌ చేసిన ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌ | Delhi Indira Gandhi International Airport Breaks Into World Top 20 Busiest Aerodromes | Sakshi
Sakshi News home page

రికార్డు బ్రేక్‌ చేసిన ఢిల్లీ ఎయిర్‌పోర్టు

Apr 10 2018 8:52 AM | Updated on Apr 10 2018 10:14 AM

Delhi Indira Gandhi International Airport Breaks Into World Top 20 Busiest Aerodromes - Sakshi

న్యూఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ (ఫైల్‌ ఫోటో)

సాక్షి, న్యూఢిల్లీ: ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం రికార్డు బ్రేక్‌ చేసింది. ప్రపంచంలోనే అత్యంత రద్దీ గల టాప్‌ 20 విమానాశ్రయాల్లో ఒకటిగా నిలిచింది. ఆరు స్థానాలు పైకి ఎగిసిన ఈ ఎయిర్‌పోర్టు, 2017 జాబితాలో టాప్‌ 20లోకి చేరింది. జీఎంఆర్‌ గ్రూప్‌ నడిపే ఈ ఢిల్లీ విమానాశ్రయం 2016లో 22వ ర్యాంకును సాధించగా.. 2017లో 16వ ర్యాంకును సాధించినట్టు ఎయిర్‌పోర్ట్‌ కౌన్సిల్‌ ఇంటర్నేషనల్‌(ఏసీఐ) ప్రకటించింది. ప్రయాణికుల రద్దీలో ఈ విమానాశ్రయం ప్రపంచంలో అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న ఎయిర్‌పోర్టుల్లో ఒకటిగా ఉందని పేర్కొంది. 

ఈ ర్యాంకింగ్‌లను 2017లో అత్యంత ఎక్కువగా ప్రయాణించిన ఎయిర్‌పోర్ట్‌ల ప్రిలిమినరీ ప్యాసెంజర్‌ ట్రాఫిక్‌ ఫలితాలను బట్టి ఏసీఐ విడుదల చేసింది. ప్యాసెంజర్‌ ట్రాఫిక్‌లో ఏడాది ఏడాదికి ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌ 14.1 శాతం వృద్ధిని నమోదుచేసిందని తెలిపింది. ప్రస్తుతం 63.45 మిలియన్ల ప్యాసెంజర్‌ ట్రాఫిక్‌ను‌(బయలుదేరడం, చేరుకోవడం రెండింట్లో) ఈ ఎయిర్‌పోర్టు కలిగి ఉన్నట్టు పేర్కొంది. ఢిల్లీ మాత్రమే కాక కోల్‌కత్తా, హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నైలు కూడా ప్రపంచంలో అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న ఎయిర్‌పోర్టులుగా ఉన్నాయని ఏసీఐ తెలిపింది.

కాగ, ఏసీఐ విడుదల చేసిన ఈ ర్యాంకింగ్‌లో తొలి స్థానంలో హార్ట్స్‌ఫీల్డ్‌-జాక్సన్‌ అట్లాంటా ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ ఉంది. 103 మిలియన్‌ ప్యాసెంజర్లతో(బయలుదేరడం, చేరుకోవడం రెండింట్లో) అగ్ర స్థానంలో ఉంది. 2016 కంటే 0.3 శాతం ట్రాఫిక్‌ వాల్యుమ్‌ తగ్గినప్పటికీ, ప్యాసెంజర్‌ ట్రాఫిక్‌లో ఇదే ముందంజలో ఉండటం విశేషం. ప్రపంచంలోని ఎయిర్‌పోర్టులకు ఏసీఐ ట్రేడ్‌ అసోసియేషన్‌. ప్రస్తుతం 176 దేశాల్లో 1953 ఎయిర్‌పోర్టుల నుంచి 641 మెంబర్లను ఇది కలిగి ఉంది. ప్రపంచంలో అత్యంత రద్దీ గల ఎయిర్‌పోర్టుల ర్యాంకులతో పాటు, అతిపెద్ద ఏవియేషన్‌ మార్కెట్‌గా ఏయే దేశాలు ఉండబోతున్నాయో ఏసీఐ అంచనాలు వెలువరిచింది. 2020 నాటికి అమెరికా, చైనాల తర్వాత భారత్‌ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఏవియేషన్‌ మార్కెట్‌గా ఉండబోతుందని ఏసీఐ అంచనావేస్తోంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement