తగ్గిన పెట్రోల్, డీజిల్‌ ధరలు

Decrease petrol and diesel prices - Sakshi

న్యూఢిల్లీ: గత రెండు నెలలుగా ఎడాపెడా పెరిగిన చమురు ధరల నుంచి సామాన్యులకు పండుగ రోజు కొంత ఊరట లభించింది. వరుసగా రెండో రోజుల పాటు పెట్రోల్, డీజిల్‌ ధరలను తగ్గిస్తూ ప్రభుత్వ రంగ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. అంతర్జాతీయంగా బ్యారెల్‌ ముడి చమురు ధర 85 డాలర్ల నుంచి 80 డాలర్లకు పడిపోవటంతో పాటు డాలర్‌తో రూపాయి మారకం విలువ కొంత పెరగటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాయి.

గురువారం లీటరు పెట్రోలుపై 21 పైసలు, డీజిల్‌పై 11 పైసలు తగ్గించగా శుక్రవారం ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌పై 24 పైసలు, డీజిల్‌పై 10 పైసలు తగ్గించాయి. దీంతో ఇక్కడ లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.82.38, డీజిల్‌ రూ. 75.48గా ఉంది. మరోవైపు దేశ ఆర్థిక రాజధాని ముంబైలో శుక్రవారం పెట్రోల్‌పై 24 పైసలు, డీజిల్‌పై 11 పైసలు తగ్గింది. దీంతో లీటర్‌ పెట్రోల్‌ రూ. 87.84, డీజిల్‌ రూ. 79.13కు చేరుకుంది.

ఈ నెల 5న లీటరు పెట్రోల్, డీజిల్‌పై రూ.2.50 (ఎక్సైజ్‌ సుంకం రూ.1.50, చమురు కంపెనీల సబ్సిడీ రూపాయి) తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కేంద్రంలో ఎన్డీయే సర్కారు అధికారం చేపట్టిన తర్వాత 2014 నుంచి 2016 మధ్య కాలంలో లీటర్‌ పెట్రోల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని రూ. 11.77, డీజిల్‌పై 13.47 రూపాయాలు పెంచింది.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top