
కొలాబ్నదిలో దొరికిన భారీ చేప
జయపురం : కొరాపుట్ జిల్లా జయపురం సబ్ డివిజన్ పరిధిలోని బొయిపరిగుడ సమితిలో ఉన్న తెంతులిగుమ్మ గ్రామం వద్ద ప్రవహిస్తున్న కొలాబ్ నదిలో పెద్ద చేప ఒకటి శుక్రవారం గ్రామస్తులకు దొరికింది.సుమారు 70 కేజీల బరువున్న ఈ చేపను జెల్లీ రకానికి చెందినదిగా గ్రామస్తులు గుర్తించారు. ఒక నదిలో ఇంత పెద్ద చేప లభించడం ఇదే తొలిసారని స్థానికులు చెబుతున్నారు.
ప్రస్తుతం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సముద్రం నుంచి నదిలోకి ఈ చేప వచ్చి ఉంటుందని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు. ఉదయం నదీ పరిసర ప్రాంతంలో ఉన్న కొంతమంది గ్రామస్తులు నది ఒడ్డున ఉన్న చేపను గుర్తించి, పట్టుకున్నారు. ప్రస్తుతం ఈ భారీ చేపను చూసేందుకు చుట్టుపక్కల గ్రామస్తులు పోటీపడుతున్నారు.