ఆకలితో 8 ఏళ్ల బాలుడి మృతి

భోపాల్ : మధ్యప్రదేశ్లోని బార్వానీ జిల్లాలో హృదయాన్ని కలచివేసే సంఘటన చోటుచేసుకుంది. తినడానికి తిండి దొరక్క ఓ ఎనిమిదేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. అంతేకాకుండా అతని కుటుంబంలోని మిగతా ఐదుగురు వాంతులు, డయేరియాతో హాస్పిటల్లో చేరారు. స్థానికుల కథనం ప్రకారం.. ‘గత కొంతకాలంగా రతన్కుమార్ కుటుంబానికి తిండి లభించకపోవడం వల్లనే ఈ ఘటన చోటుచేసుకుంది. కడు పేదరికంలో నివసిస్తున్న ఆ కుటుంబం.. రోజువారి కూలీ పని ద్వారా జీవనం సాగిస్తోంది. అయితే గత కొన్ని రోజులుగా వారికి తినడానికి తిండి లభించలేదు. అందువల్లే ఇలా జరిగింది. వారికి కనీసం ప్రభుత్వం అందించే రేషన్ కూడా లభించడం లేద’ని తెలిపారు.
కాగా, ఈ ఘటనపై బార్వానీ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ అన్షు జావ్లా విచారణకు ఆదేశించారు. గత కొద్ది రోజులుగా వారు ఎటువంటి ఆహారం తీసుకోకపోవడం వల్లనే ఇలా జరిగినట్టు ప్రాథమికంగా తెలుస్తుందని పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వ అందించే సదుపాయాలు వారికి అందేలా చూస్తామన్నారు. ఈ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి