లేడీస్ వాష్రూంలో 3 కేజీల బంగారం
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమనాశ్రయంలోని వాష్ రూమ్లో 3 కేజీల బంగారం దొరికింది. సీఐఎస్ఎఫ్ బలగాలు జరిపిన సోదాల్లో మహిళల వాష్రూంలో రూ. 90 లక్షల విలువ గల బంగారం దొరికినట్లు అధికారులు చెప్పారు. బాంబు ఉందనే సమాచారంతో విమనాశ్రయంలో సోదాలు చేపట్టిన సీఐఎస్ఎఫ్ (సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యురిటీ ఫోర్స్) బలగాలు బాంబు స్వ్కౌడ్ను రంగంలోకి దింపాయి.
అయితే గాలింపులు చేస్తుండగా అందరూ విస్తుపోయేలా లేడిస్ వాష్రూంలో బాంబుకు బదులు బంగారం దొరికింది. తెల్లని పేపర్ టేప్లో చుట్టి ఉన్న ఓ ప్యాకెట్లో 3 కిలోల బరువున్న 3 బంగారు బిస్కెట్లు ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక కిలో ఉంది. ఆ బంగారం ఎవరిది ? దానిని ఎవరు స్మగ్లింగ్ చేస్తున్నారు? అనే విషయాలు ఇంకా తెలియరాలేదు. అయితే కస్టమ్స్ అధికారులకు సమాచారం అందించి బంగారం వారికి అప్పగించి తదుపరి దర్యాప్తు ప్రారంభించారు.