గోల్డ్‌ స్మగ్లింగ్ ఇంకా పెరుగుతుందేమో!! | Gold Silver Duty Hike Industry Fears Surge in Smuggling Black Marketing | Sakshi
Sakshi News home page

గోల్డ్‌ స్మగ్లింగ్ ఇంకా పెరుగుతుందేమో!!

May 14 2026 4:23 AM | Updated on May 14 2026 4:28 AM

Gold Silver Duty Hike Industry Fears Surge in Smuggling Black Marketing

సుంకాల పెంపుతో పరిశ్రమ ఆందోళన

స్మగ్లింగ్, బ్లాక్‌ మార్కెటింగ్‌ ముప్పు..

ఆభరణాల వ్యాపారానికి విఘాతం

సాక్షి, బిజినెస్‌ డెస్క్‌: పసిడి, వెండిపై సుంకాల మోతతో ఆభరణాల మార్కెట్‌ గందరగోళంలో పడింది. దిగుమతులు తగ్గి విదేశీ మారకం నిల్వలను నిలబెట్టుకునేందుకు, తద్వారా రూపాయి విలువ పడిపోకుండా చూసుకునేందుకు ఇది దోహదపడనుంది. అలాగే, కొత్త కొనుగోళ్ల కోసం దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి లేకుండా పాత వాటిని కొత్త వాటికి మార్చుకునేలా ప్రోత్సహించడం ద్వారా రీసైక్లింగ్‌కి ఊతమివ్వనుంది.

అయితే, అదే సమయంలో స్మగ్లింగ్‌ రిస్కులు పెరుగుతాయని, ఆభరణాల వ్యాపారాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. పసిడి, వెండి దిగుమతులపై సుంకాల మోత పలు సమస్యలకు దారి తీస్తుందని పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. దీనితో వజ్రాభరణాల పరిశ్రమ మరింత గడ్డుకాలం ఎదుర్కొనాల్సి వస్తుందని ఎగుమతిదార్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్మగ్లింగ్, బ్లాక్‌ మార్కెటింగ్‌ రిస్కులు పెరిగిపోతాయని హెచ్చరిస్తున్నారు.

పరిశ్రమకు వెన్నెముకలాంటి లఘు, చిన్న, మధ్యతరహా తయారీదార్లు ఇప్పటికే నిధుల కొరత ఎదుర్కొంటూ ఉండగా, తాజా పరిణామం అశనిపాతంలా మారుతుందన్నారు. దిగుమతి సుంకాలను పెంచడం వల్ల సాధారణంగానే ధరలు పెరుగుతాయని, కాకపోతే కొనుగోళ్లను తగ్గించడానికి ఉపయోగపడకపోవచ్చని పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో పసిడి రేట్లు రెట్టింపైనప్పటికీ దిగుమతులు అదే నిష్పత్తిలో తగ్గకపోవడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. ఈ నేపథ్యంలో సుంకాల పెంపులాంటి చర్యల వల్ల స్మగ్లింగ్‌కి ఊతం లభిస్తుందని, ఎగుమతి వ్యయాలు పెరిగిపోతాయని ఎగుమతిదార్లు తెలిపారు.

‘పొదుపు చర్యలు, బులియన్‌ దిగుమతులపై సుంకాల పెంపు వల్ల వ్యాపారం మరింత కష్టతరం అవుతుంది. గ్రే మార్కెట్, స్మగ్లింగ్‌ పెరిగి, ఎకానమీలో సమాంతర వ్యవస్థ ఏర్పాటుకు దారి తీసే ముప్పు ఉందని పరిశ్రమ ఆందోళన చెందుతోంది’ అని అఖిల భారత రత్నాభరణాల మండలి (జీజేసీ) చైర్మన్‌ రాజేష్‌ రోక్డే తెలిపారు. కస్టమ్స్‌ సుంకం, జీఎస్‌టీ, వ్యవసాయ సెస్సులన్నీ కలగలిసిన దిగుమతి సుంకాల పెంపుతో 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ. 27,000 మేర భారం అవుతుందని చెప్పారు. సుంకాలను పెంచడం వల్ల బంగారం రేట్లు మరింత పెరగడం తప్ప దిగుమతులకు అడ్డుకట్ట పడటం చాలా అరుదని రత్నాభరణాల ఎగుమతుల ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) చైర్మన్‌ కిరీట్‌ భన్సాలీ వ్యాఖ్యానించారు.  

రీసైక్లింగ్‌కి దన్ను.. 
పసిడి దిగుమతి సుంకాల పెంపుతో స్వల్పకాలికంగా ఆభరణాల విక్రయ పరిమాణం తగ్గుతుందని జ్యుయలర్లు తెలిపారు. అయితే, డిమాండ్‌ స్థిరంగానే ఉండొచ్చని వివరించారు. భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, భారీ క్రూడాయిల్‌ ధరలు, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గే వరకు పెంచిన సుంకాలు ఏడాది పాటు కొనసాగే అవకాశం ఉందని సెన్కో గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌ ఎండీ, సీఈవో సువంకర్‌ సేన్‌ చెప్పారు. పరిమాణంపరంగా 10–15% ప్రభావం పడినప్పటికీ, విలువపరంగా లావాదేవీలు అధిక స్థాయిలోనే ఉంటాయన్నారు.

వినియోగదారులు తేలికపాటి ఆభరణాలను కొనేందుకు మొగ్గు చూపొచ్చన్నారు. మరో వైపు, సంస్కృతి, పెట్టుబడులపరంగా బంగారానికి ప్రాధాన్యత ఉన్న నేపథ్యంలో పెళ్లిళ్లు, పండుగల సందర్భంగా కొత్తగా కొనుగోలు చేసే వారి కారణంగా పసిడికి డిమాండ్‌ కొనసాగుతుందని తెలిపారు. సుంకాల పెంపు వల్ల గోల్డ్‌ రీసైక్లింగ్‌ పెరుగుతుందన్నారు. ప్రధాని పిలుపుతో  ‘నేషన్‌ ఫస్ట్‌ గోల్డ్‌4 ఇండియా’ కార్యక్రమాన్నిఆవిష్క రించినట్లు కల్యాణ్‌ జ్యుయలర్స్‌ ఎండీ కల్యాణరామన్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement