కాంక్రీట్‌ మిక్సింగ్‌‌ ట్రక్కులో 18 మంది

18 People Caught Travelling In Concrete Mixer Truck in Indore - Sakshi

ఇండోర్‌: దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమల్లో ఉన్న నేపథ్యంలో సొంత రాష్ట్రానికి వెళ్లేందుకు అక్రమ మార్గాన్ని ఆశ్రయించారంటూ పోలీసులు 18 మందిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. కాంక్రీట్‌ కలిపే వాహనం లోపల కూర్చున్న వారందరినీ దింపి.. ట్రక్‌ను పోలీస్‌ స్టేషనుకు తరలించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో చోటుచేసుకుంది. మహారాష్ట్ర నుంచి లక్నోకు వెళ్తున్న కాంక్రీట్‌ ట్రక్కులో ప్రయాణిస్తున్న 18 మందిపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ ఉమాకాంత్‌ చౌదరి తెలిపారు. ఇండోర్‌లో తనిఖీ చేయగా డోమ్‌ లోపల ఉన్నవారు ఒక్కొక్కరుగా బయటకు వచ్చారని వెల్లడించారు. కాగా ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికుల్లో కొంతమంది కాలినడకన మరికొందరు సైకిళ్లపై స్వస్థలాలకు పయనమవుతున్న విషయం తెలిసిందే.(వలస కార్మికులపై ఎందుకింత ఆలస్యం?)

ఈ క్రమంలో మార్గమధ్యలోనే కొంతమంది మరణించారు. మరికొంత మంది ఆకలి బాధతో అలమటిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వలస కూలీలను సొంతూళ్లకి పంపడానికి శుక్రవారం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అయితే పలు రాష్ట్రాలు ఇంకా అనుమతులు ఇవ్వకపోవడంతో వలస కార్మికుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికుల్ని రాష్ట్రంలోకి రావడానికి అనుమతించిన కర్ణాటక వంటి రాష్ట్రాలు... సొంతూళ్లకి రావాలని అనుకుంటున్న వారు ఎవరైనా ప్రయాణ ఖర్చులు వాళ్లే భరించుకోవాలని పేర్కొన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా..  అరుణాచల్‌ ప్రదేశ్‌కు చెందిన దాదాపు 18 వేల మందిని ప్రాధాన్యత క్రమంలో రాష్ట్రానికి తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని అరుణాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి పెమా ఖండూ శనివారం తెలిపారు.(కొడుక్కి మాజీ మంత్రి గుణపాఠం)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top