
7060 కోట్లతో వంద స్మార్ట్ సిటీల అభివృద్ధి
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7060 కోట్ల రూపాయలతో వంద స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేస్తామని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7060 కోట్ల రూపాయలతో వంద స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేస్తామని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. గురువారం నాడు లోక్సభలోప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆయనీ విషయం తెలిపారు. ''అభివృద్ధి ఫలాలు అత్యధికులకు అందేకొద్దీ, నగరాలకు వలసలు పెరుగుతాయి. జీవన ప్రమాణాలు పెరగాలని భావిస్తారు. వారికి తగిన సౌకర్యాలు కల్పించకపోతే నగరాలు నివాసయోగ్యం కాకుండా పోతాయి. అందుకే దేశంలో 100 స్మార్ట్ సిటీలు అభివృద్ధి చేయాలన్నది ప్రధాని యోచన. ఇందుకోసం 7060 కోట్లను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేటాయిస్తాం'' అన్నారు.
పల్లెలను కూడా అభివృద్ధి చేయడం ద్వారా గుజరాత్ మంచి ఫలితాలు సాధించిందని, అదే పద్ధతిలో.. పీపీపీ విధానంలో నిధులు సేకరించి దేశంలోని అన్ని పల్లెలనూ అభివృద్ధి చేస్తామని జైట్లీ చెప్పారు. విద్యుత్ చాలా ముఖ్యమైన అవసరమని, గ్రామాల్లో కూడా రోజుకు 24 గంటలూ విద్యుత్ అందాలని, ఇందుకోసం దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామజ్యోతి యోజనకు 500 కోట్లు కేటాయిస్తాం. గుజరాత్లో ఏర్పాటు చేస్తున్న సర్దార్ పటేల్ విగ్రహం కోసం 200 కోట్లు ఇస్తామన్నారు.
బ్యాంకింగ్ రంగాన్ని కూడా మనం బలోపేతం చేసుకోవాల్సి ఉందని, అందుకోసం భారత ప్రజలకు ప్రభుత్వరంగ బ్యాంకులలో షేర్లు అమ్ముతామని అత్యధిక శాతం షేర్లు మాత్రం ప్రభుత్వం వద్దనే ఉంటాయని ఆయన చెప్పారు.