ఆమెతో నాకు పెళ్లా?
సినీ సెలబ్రిటీలపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు హల్చల్ చేస్తుంటాయి. ఇటువంటి వార్తలను కొందరు లైట్ తీసుకుంటే, కొందరు వివరణ ఇస్తుంటారు. తాజాగా తమిళ హీరో విష్ణు విశాల్ కూడా ఆన్లైన్లో హల్చల్ చేస్తున్న ఓ వార్తపై స్పందించారు. ‘విష్ణు విశాల్, అమలా పాల్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు’ అని వస్తున్న వార్తలకు విష్ణు స్పందిస్తూ – ‘‘ఆమెతో నాకు పెళ్లా? ఇదొక స్టుపిడ్ న్యూస్. ఏదైనా వార్త రాసేటప్పుడు బాధ్యతగా వ్యవహరించాలి.
లేనిపోని పుకార్లు పుట్టించి, కుటుంబాలను బాధపెట్టడం సరికాదు. ఇకపై దీని గురించి ఎటువంటి వార్తలు రాయకండి’’ అన్నారు. కాగా విష్ణు విశాల్, అమలా పాల్ జంటగా నటించిన ‘రాక్షసన్’ సినిమా ఈ ఏడాది అక్టోబర్లో విడుదలైంది. డైరెక్టర్ ఏ.ఎల్. విజయ్ని ప్రేమ వివాహం చేసుకుని, ఆ తర్వాత విడిపోయారు అమలా పాల్. ప్రస్తుతం ఆమె సినిమాలతో బిజీగా ఉన్నారు.