ఈ సినిమాలో హీరోలు ఉండరు

veera bhoga vasantha rayalu title logo release - Sakshi

‘‘వీరభోగ వసంతరాయలు’ చిత్రంలో హీరోలు అంటూ ఉండరు. ప్రతి క్యారెక్టర్‌ హీరోనే. ఇది ప్రయోగాత్మక సినిమా. తెలుగులో కచ్చితంగా ఇలాంటి సినిమా రాలేదు. డైరెక్టర్‌ ఇంద్ర ప్రపంచాన్ని తలకిందులుగా చూశాడు. సినిమా కూడా అలాంటి కాన్సెప్ట్‌తోనే ఉంటుంది’’ అని హీరో నారా రోహిత్‌ అన్నారు. నారా రోహిత్, శ్రీవిష్ణు, సుధీర్‌ బాబు, శ్రియ ముఖ్య తారలుగా రూపొందుతోన్న మల్టీస్టారర్‌ ‘వీరభోగ వసంతరాయలు’. ఇంద్రసేన.ఆర్‌ దర్శకత్వంలో ఎంవికె రెడ్డి సమర్పణలో అప్పారావు బెల్లాన నిర్మిస్తున్న ఈ చిత్రం టైటిల్‌ లోగోను హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఇంద్రసేన.ఆర్‌ మాట్లాడుతూ– ‘‘చిన్నప్పుడు మా ఇంటి వెనకాల ఉన్న గుడిలో రోజూ ‘బ్రహ్మంగారి చరిత్ర’ వినేవాణ్ని.

అందులో ‘వీరభోగ వసంతరాయలు’ గురించి విన్నా. అది నా మనసులో స్థిరంగా నాటుకుపోయింది. కథకి తగ్గ టైటిల్‌ ఇది. పాపాలు పెరిగాయనే అంశం చుట్టూనే కథ తిరుగుతుంది’’ అన్నారు. ‘‘ఇప్పటివరకూ ఎవరూ చూడని విధంగా, ఊహించని విధంగా ఈ సినిమా ఉంటుంది.  నిర్మాతగా నన్ను ఈ ప్రపంచానికి పరిచయం చేసింది డాక్టర్‌ ఎంవీకే రెడ్డిగారు. సౌతాఫ్రికా, అమెరికాలో ఉన్న డాక్టర్‌ మాధవి, డాక్టర్‌ నిరంజన్‌గారు నాకు చాలా సపోర్ట్‌ ఇచ్చారు’’ అన్నారు అప్పారావు బెల్లాన. ‘‘సినిమా ప్రారంభమైన పదిహేను నిమిషాలకు ఇంగ్లీష్‌ సినిమానా? తెలుగు సినిమానా? అనే విషయం అర్థమవుతుంది. డైరెక్టర్‌ ఇంద్ర ఈ చిత్రం కోసం చాలా కష్టపడ్డాడు. నన్ను టార్చర్‌ పెట్టాడు.  కానీ, అవుట్‌పుట్‌ చూసుకున్నాక వెరీ వెరీ హ్యాపీ’’ అన్నారు శ్రీ విష్ణు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top