ట్రావెల్స్‌ బస్సు డ్రైవర్‌ అతివేగానికి.. | Fatal accident on Vijayawada Hyderabad highway | Sakshi
Sakshi News home page

ట్రావెల్స్‌ బస్సు డ్రైవర్‌ అతివేగానికి..

Jul 6 2026 5:08 AM | Updated on Jul 6 2026 5:08 AM

Fatal accident on Vijayawada Hyderabad highway

నలుగురి దుర్మరణం.. కారును ఢీకొట్టిన బస్సు 

విజయవాడ–హైదరాబాద్‌ హైవేపై ఘోర ప్రమాదం 

మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన తల్లి, ఇద్దరు పిల్లలు 

కూతురుకు మెరుగైన వైద్యచికిత్స కోసం చెన్నైకి.. 

తిరిగివస్తుండగా చోటుచేసుకున్న ఘటన

చిట్యాల: విజయవాడ–హైదరాబాద్‌ జాతీయ రహదారిపై నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామ శివారులో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. చిట్యాల ఎస్‌ఐ మామిడి రవికుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని మధురానగర్‌(యూసుఫ్‌గూడ)లో నివాసముంటున్న మలిరెడ్డి వీర వెంకట నాగ వరప్రసాద్‌బాబు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ)లో ఉద్యోగం చేస్తున్నాడు. అతడి స్వస్థలం ఏపీలోని కాకినాడ కాగా.. ఉద్యోగ రీత్యా కుటుంబంతో కలిసి హైదరాబాద్‌లో నివాసముంటున్నాడు. 

వరప్రసాద్‌బాబు, అతడి భార్య విజయలక్ష్మి(40), కుమార్తె శ్రియ(17), కుమారుడు ప్రభవ్‌(12)తోపాటు వారికి తెలిసిన వ్యక్తి అయిన హైదరాబాద్‌లోని గుండ్లపోచంపల్లిలో నివాసముంటున్న సినీ ఎడిటర్‌ కట్టా శ్రీకర్‌ ప్రసాద్‌(62)తో కలిసి తమ కూతు రుకు మెరుగైన వైద్యచికిత్స కోసం శనివారం ఉదయం చెన్నై వెళ్లారు. తిరిగి శనివారం రాత్రి చెన్నై నుంచి కారులో హైదరాబాద్‌కు బయల్దేరారు. మార్గమధ్యలో ఆదివారం తెల్లవారుజామున చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామ శివారులో విజయవాడ–హైదరాబాద్‌ హైవేపై గల యూటర్న్‌ వద్దకు రాగానే అతివేగంగా వస్తున్న ట్రావెల్స్‌ బస్సు వెనుక నుంచి కారును ఢీకొట్టింది. 

ఈ ప్రమాదంలో కారు వెనుక సీట్లో కూర్చున్న విజయలక్ష్మి, శ్రియ, ప్రభవ్‌తో పాటు ముందు కూర్చున్న కట్టా శ్రీకర్‌ ప్రసాద్‌ అక్కడికక్కడే మృతిచెందారు. కారు డ్రైవింగ్‌ చేస్తున్న వరప్రసాద్‌బాబుకు తీవ్ర గాయాలై అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. సమాచారం తెలుసుకున్న చిట్యాల ఎస్‌ఐ మామిడి రవికుమార్, తన సిబ్బందితో వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 

గాయపడిన వరప్రసాద్‌బాబును చికిత్స నిమిత్తం నార్కట్‌పల్లిలోని కామినేని ఆస్పత్రికి తరలించారు. ట్రావెల్స్‌ బస్సు డ్రైవర్‌ అతివేగంగా, నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేయడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. ఘటనా స్థలాన్ని నల్లగొండ ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ పరిశీలించారు. రోడ్డు ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement