శభాష్‌ మిథు

Taapsee Pannu To Star In Biopic Of Cricketer Mithali Raj  - Sakshi

వెండితెరపై కొత్త ఆట ఆడటానికి రెడీ అయిపోయారు కథానాయిక తాప్సీ. ‘శభాష్‌ మిథు’లో క్రికెటర్‌గా కనిపించబోతున్నారామె. ప్రముఖ మహిళా క్రికెటర్‌ మిథాలీ రాజ్‌ బయోపిక్‌ ఇది. ఈ చిత్రానికి రాహుల్‌ థోలాకియా దర్శకుడు. ‘కహానీ’ (2012), ‘క్వీన్‌’ (2014), ‘మేరీకోమ్‌’ (2014), ‘పద్మావత్‌’ (2018) వంటి ఉమెన్‌ సెంట్రిక్‌ ఫిల్మ్స్‌ తీసిన వయాకామ్‌ 18 సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది. మంగళవారం మిథాలీ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను ప్రకటించడం విశేషం. ‘‘కలలను సాకారం చేసుకోవాలనుకునే యువతులకు నా సినిమా ఓ స్ఫూర్తిగా నిలుస్తుందన్న నమ్మకం ఉంది’’ అని పేర్కొన్నారు మిథాలీరాజ్‌. ‘‘మిథాలీ.. నీ పుట్టినరోజుకి ఏం బహుమతి ఇవ్వాలో అర్థం కావడం లేదు.

వెండితెరపై నాలో నువ్వు ప్రతిబింబించేలా ప్రయత్నిస్తానని ప్రామిస్‌ చేస్తున్నాను. కవర్‌ డ్రైవ్‌ నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను’’ అన్నారు తాప్సీ. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘సూర్మ’ (2017)లో హాకీ ప్లేయర్‌గా, సాంద్‌ కీ ఆంఖ్‌ (2019) సినిమాలో షూటర్‌గా నటించిన తాప్సీ తాజాగా ‘రష్మీ: ద రాకెట్‌’లో అథ్లెట్‌ (రన్నింగ్‌)గా నటిస్తున్నారు. ఇప్పుడు ‘శభాష్‌ మిథు’ సినిమా కోసం ఆమె క్రికెటర్‌గా మారారు. ఇవన్నీ గమనిస్తుంటే బాలీవుడ్‌లో స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌ మూవీ అంటే తాప్సీనే చేయాలని దర్శక–నిర్మాతలు భావిస్తున్నట్లు అనిపిస్తోంది కదూ.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top