పదేళ్ల క్రితం వచ్చిన ఆలోచన ఇది | T. Subbarami Reddy announces on TSR-TV9 National Film Awards | Sakshi
Sakshi News home page

పదేళ్ల క్రితం వచ్చిన ఆలోచన ఇది

Feb 15 2019 3:47 AM | Updated on Feb 15 2019 3:47 AM

T. Subbarami Reddy announces on TSR-TV9 National Film Awards - Sakshi

పరుచూరి గోపాలకృష్ణ, నగ్మా, టి. సుబ్బరామి రెడ్డి, శోభన కామినేని, రఘురామ కృష్ణంరాజు

‘‘కళాకారులకు జాతీయ స్థాయిలో ఫిల్మ్‌ అవార్డులు ఇవ్వాలని పదేళ్ల కిత్రం నాకో ఆలోచన వచ్చింది. అదీ ప్రజాభిప్రాయం తెలుసుకుని ఇవ్వాలని. ప్రజాభిప్రాయ సేకరణకు టీవీ చానల్‌ ఉంటే బాగుంటుందని టీ వీ9తో కలిసి ‘టీఎస్‌ఆర్‌ టీవీ9 నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌’ని స్థాపించా’’ అని కళాబంధు, ‘టీఎస్‌ఆర్‌ టీవీ9 నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌’ చైర్మన్‌ టి.సుబ్బరామి రెడ్డి అన్నారు. 2017, 2018 సంవత్సరాలకు ‘టీఎస్‌ఆర్‌ టీవీ9 నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌’కి ఎంపికైన వారి వివరాలను గురువారం సుబ్బరామిరెడ్డి ప్రకటించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘ఈ అవార్డ్స్‌ ఫంక్షన్‌ని ఈ నెల 17న విశాఖపట్నంలోని పోర్ట్‌ స్టేడియంలో నిర్వహిస్తున్నాం. తెలుగు, హిందీ, పంజాబీ, భోజ్‌పురి, తమిళ్, కన్నడ, మలయాళం.. ఇలా భారతదేశంలోని అన్ని భాషల నటీనటులకు అవార్డులు ఇస్తున్నాం. ఈ అవార్డుల జ్యూరీ మెంబర్లుగా నగ్మా, జీవితా రాజశేఖర్, మీనా, పరుచూరి గోపాలకృష్ణ, కేఎస్‌ రామారావు, నరేశ్, రఘు రామకృష్ణంరాజు, పింకీ రెడ్డి, శోభన కామినేని వ్యవహరించారు. వేలాది మంది ప్రజలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

అన్ని భాషల నుంచి దాదాపు 60మంది ఫిల్మ్‌ స్టార్స్‌ అవార్డులు తీసుకోనున్నారు’’ అన్నారు. జీవిత సాఫల్య పురస్కారానికి ఎంపికైన నటి నగ్మా మాట్లాడుతూ –‘‘నా లైఫ్‌ ఇంకా చాలా ఉంది.. ఇంకా చాలా సినిమాలు చేయాలి. అప్పుడే మీరు (సుబ్బరామిరెడ్డి) లైఫ్‌టైమ్‌ ఎచీవ్‌మెంట్‌ అవార్డు ప్రకటించారు (నవ్వుతూ). ఈ అవార్డుతో పాటు సామాజిక సేవ చేసినందుకు మార్చిలో ‘రాజీవ్‌గాంధీ’ అవార్డుకూడా అందుకోబోతున్నా. తెలుగులో నా సినీ ప్రయాణం ఇంకా కొనసాగాలి’’ అన్నారు. పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ– ‘‘అందరికంటే కష్టమైన పని ఏంటంటే జ్యూరీ సభ్యునిగా ఉండటం.

నక్షత్రాల్లో చంద్రుడ్ని చూపించి ఇందులో ఎవరు పెద్ద, గొప్ప అంటే చంద్రుడ్ని చూపిస్తాం. అందరి చంద్రుల్ని చూపించి ఇందులో ఏ చంద్రుడు గొప్ప అంటే ఏం చెబుతాం? అలా ఈ హీరోలు, హీరోయిన్లందరూ చందమామలే. మా అదృష్టం ఏంటంటే కొన్ని వేలమంది చక్కగా ఓటింగ్‌లో పాల్గొన్నారు. మేం రెండు మూడుసార్లు చర్చించుకుని ఫైనల్‌ లిస్ట్‌ తయారు చేశాం. వర్షం పడితే రైతుకు ఆనందం. కళాకారుల ముఖం ఆనందంతో తడిస్తే మా సుబ్బరామిరెడ్డిగారికి ఆనందం. మహాభారతంలో ధర్మరాజును అజాతశత్రువు అంటారు. ఈ భారతదేశంలో నాకు సజీవంగా కనిపిస్తున్న ఏకైక అజాత శత్రువు సుబ్బరామిరెడ్డిగారు’’ అన్నారు. జ్యూరీ సభ్యులు శోభన కామినేని, రఘురామ కృష్ణంరాజు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement