నటి కిడ్నాప్‌ కేసు; అతడిని సస్పెండ్‌ చేయాల్సిందే!

Revathi Pens Letter To AMMA Over Actor Dileep Membership - Sakshi

తిరువనంతపురం : నటుడు దిలీప్‌ సభ్యత్వాన్ని కొనసాగిస్తారా లేదా అన్న అంశమై తుది నిర్ణయాన్ని అక్టోబర్‌ 9లోగా చెప్పాలని నటి రేవతి అమ్మ(అసోసియేషన్‌ ఆఫ్‌ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్‌)కు లేఖ రాశారు. ప్రముఖ వర్ధమాన నటి కిడ్నాప్‌, లైంగిక వేధింపుల కేసులో దిలీప్‌ విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడిని అసోసియేషన్‌ నుంచి తొలగించాలంటూ పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు గత కొంత కాలంగా డిమాండ్‌ చేస్తున్నారు. కానీ ఈ విషయమై ఇంతవరకు ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో రేవతి, పద్మప్రియ, పార్వతిలు అసోసియేషన్‌కు లేఖ రాశారు. ఈ కేసులో కోర్టు తీర్పు వెలువరించే వరకు అతడిని సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. (చదవండి : ‘మలయాళ వెండితెర’పై మరక!)

ఈ క్రమంలో దిలీప్‌ విషయంలో కమిటీ నిర్ణయాన్ని తప్పుపట్టిన రేవతి.. గతంలో ఇలా క్రమశిక్షణలు ఉల్లంఘించిన వారిని సస్పెండ్‌ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. దిలీప్‌ కేసు విషయమై నిర్ణయాన్ని తెలపాలంటూ ఇది వరకు రెండు సార్లు లేఖ రాసినా సమాధానం రాకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. కాగా నటి కిడ్నాప్, వేధింపుల కేసు విచారణలో ఉండగానే నటుడు దిలీప్‌ను ‘అమ్మ’లో తిరిగి చేర్చుకోవడాన్ని అసోసియేషన్‌కు చెందిన పలువురు బహిరంగంగానే విమర్శించారు. నటికి సాయం చేయాలన్నా, ఆమెకు నిజంగా న్యాయం జరగాలంటే దిలీప్‌ను అసోసియేషన్‌ నుంచి శాశ్వతంగా బహిష్కరించాలని పలువురు సెలబ్రిటీలు కోరినా ప్రయోజనం లేకపోయింది. తాజాగా రేవతి లేఖతో ఈ అంశం మరోసారి చర్చనీయాంశమైంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top