ఒకే జానర్‌లో సినిమాలు తీస్తున్నారు | palasa movie first look launch | Sakshi
Sakshi News home page

ఒకే జానర్‌లో సినిమాలు తీస్తున్నారు

Jun 19 2019 3:30 AM | Updated on Jun 19 2019 3:30 AM

palasa movie first look launch - Sakshi

కరుణకుమార్, ప్రసాద్, తమ్మారెడ్డి భరద్వాజ, మారుతి, రక్షిత్, నక్షత్ర

‘‘ముంబైలో మాఫియా ఒకలా, విజయవాడలో మరోలా ఉంటుంది. ప్రతి ఊరిలో ఒక్కోటి ఒక్కోలా ఉంటుంది. అది ఎలా ఉంటుందన్నది ‘పలాస’లో కొత్తగా ఉంటుంది’’ అని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. రక్షిత్, నక్షత్ర జంటగా కరుణ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పలాస 1978’. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ధ్యాన్‌ అట్లూరి నిర్మించారు. రక్షిత్‌ బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ని దర్శకుడు మారుతి, తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేశారు. ఈ సందర్భంగా తమ్మారెడ్డి మాట్లాడుతూ– ‘‘ఒకప్పుడు ప్రతిదర్శకుడు ఒక్కో జానర్‌లో సినిమాలు తీసేవారు. కానీ ఇప్పుడు అందరూ ఒకే జానర్‌లో సినిమాలు తీస్తున్నారు. ‘కేరాఫ్‌ కంచరపాలెం’ లుక్‌లో కొత్త సబ్జెక్ట్‌తో తీసిన ‘పలాస’ ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తుంది’’ అన్నారు.

మారుతి మాట్లాడుతూ– ‘‘ఫస్ట్‌ లుక్‌ పోస్టర్, హీరో లుక్‌ బాగున్నాయి. తమ్మారెడ్డిగారు ఇలాంటి సినిమాలకు అండగా నిలబడటం çహ్యాపీ’’ అన్నారు. ‘‘తెలుగు కథ వైజాగ్‌ దాటి ముందుకుపోలేదు. పలాస ప్రాంతం నేపథ్యంలో రాసుకున్న ఈ కథను ప్రసాద్, తమ్మారెడ్డిలకు చెప్పాను. వాళ్లు ముందుకు రావడంతోనే సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాగలుగుతున్నాను. 40 యేళ్లపాటు సాగే కథను 40 రోజుల్లో తీయడం మా టీమ్‌ సహకారం వల్లే సాధ్యం అయింది’’ అన్నారు కరుణకుమార్‌. ‘‘ఇందులో క్రూరమైన పాత్ర చేశాను’’ అన్నారు చిత్ర సంగీతదర్శకుడు రఘు కుంచె. ‘‘రెండు నెలల పాటు పలాసలో షూటింగ్‌ చేశాం. ‘గాంగ్స్‌ ఆఫ్‌ వస్సీపూర్‌’ లాంటి సినిమాను ప్రేక్షకులకు ఇవ్వబోతున్నాం’’ అన్నారు రక్షిత్‌. నక్షత్ర, రచయిత నాగేంద్ర, కెమెరామెన్‌ విన్సెంట్‌ అరుల్, వెంకట సిద్ధారెడ్డి మాట్లాడారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: ఎ.ఆర్‌ బెల్లన్న.
 

Advertisement
 
Advertisement
Advertisement