
అచ్చమైన తెలుగు పాటల్లా ఉంటాయి : సిరివెన్నెల
మణిరత్నం గారి సినిమాలు చూసి ఆయనకు అభిమాని కాని వారు ఎవరూ ఉండరేమో... అందుకే ఆయన ఈ సినిమాకు
‘‘మణిరత్నం గారి సినిమాలు చూసి ఆయనకు అభిమాని కాని వారు ఎవరూ ఉండరేమో... అందుకే ఆయన ఈ సినిమాకు పాటలు రాయమని అడగ్గానే కాదనలేకపోయాను. కానీ లిప్ సింక్తో సంబంధం లేకుండా పాటలు రాస్తానన్నా. దానికి ఆయన ఒప్పుకున్నారు కూడా. అందుకే అచ్చమైన తెలుగు పాటలు ఉన్నట్టే ఉంటాయి’’ అని ప్రముఖ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అన్నారు. మణిరత్నం దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ జంటగా నటించిన చిత్రం ‘ఓకే కన్మణి’. ఈ చిత్రాన్ని ‘ఓకే బంగారం’ పేరుతో మద్రాస్ టాకీస్, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ తెలుగులోకి విడుదల చేస్తున్నాయి. ఎ.ఆర్. రహమాన్ పాటలు స్వరపరిచారు. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ వేడుక హైదరాబాద్లో జరిగింది.
ఈ సందర్భంగా నిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ- ‘‘ ‘అమృత’ సినిమాను తెలుగులో విడుదల చేసి, నిర్మాతగా మారాను. మళ్లీ 15 సంవత్సరాల తర్వాత ‘ఓకే బంగారం’ విడుదల చేస్తున్నాను. ఈ సినిమా కథ చదివి వెంటనే తెలుగులో విడుదల చేయాలనుకున్నాను. ఏప్రిల్ 17న చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అని చెప్పారు. నాని మాట్లాడుతూ - ‘‘నేను మణిరత్నంగారి అభిమానిని. ఈ సినిమాలో హీరో పాత్రకు డబ్బింగ్ చెప్పడం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు. వీవీ వినాయక్, పైడిపల్లి వంశీ, నిఖిల్, సాయిధరమ్తేజ్ తదితరులు పాల్గొన్నారు.